బెంగళూర్ : కర్నాటక రాష్ట్రం కరవు కోరల్లో చిక్కుకుంటే సీఎం సిద్ధరామయ్య ప్రైవేట్ విమానంలో విహరించడాన్ని బీజేపీ (BJP) తప్పుపట్టింది. విమానంలో సీఎం సిద్ధరామయ్యతో కలిసి తాను విమానంలో వెళుతున్న వీడియోను కర్నాటక కాంగ్రెస్ మంత్రి బీజడ్ జమీర్ అహ్మద్ ఖాన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అనంతరం ఈ అంశంపై కాంగ్రెస్ లక్ష్యంగా బీజేపీ విమర్శలు గుప్పించింది.
ప్రైవేట్ విమానంలో సీఎం సిద్ధరామయ్యతో మంత్రి కలిసున్న దృశ్యాలను ఈ వీడియోలో గమనించవచ్చు. కాంగ్రెస్ క్రౌడ్ ఫండింగ్ క్యాంపెయిన్పై కూడా బీజేపీ నేత అమిత్ మాలవీయ ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. ఓ వైపు కాంగ్రెస్ పార్టీ క్రౌడ్ ఫండింగ్ సాకు చూపుతూ ఇండియా విపక్ష కూటమి భేటీలో కనీసం సమోసాలను కూడా ఇవ్వలేదని అయితే మరోవైపు కర్నాటక మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ సీఎం సిద్ధరామయ్యతో కలిసి ప్రైవేట్ విమానంలో విహరిస్తున్నారని బీజేపీ ఎద్దేవా చేసింది.
కరువు సహాయక నిధులను కోరేందుకు ప్రైవేట్ విమానంలో ఢిల్లీకి బయలుదేరడం హాస్యాస్పదమని కాషాయ నేత అమిత్ మాలవీయ అన్నారు. కర్నాటక మంత్రి, సీఎం ప్రైవేట్ విమానాల్లో విహరిస్తూ కరువు సహాయ నిధుల కోసం ఢిల్లీ కలిసివెళ్లారని వ్యాఖ్యానించారు. ఇక ఈ వీడియోపై కర్నాటక బీజేపీ నేత సీటీ రవి కూడా స్పందించారు. కరవుతో కుదేలైన మన రైతులకు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు లేవని, సీఎం విహరించడానికి మాత్రం నిధులు ఉంటాయని వ్యాఖ్యానించారు.
Read More :
Sakshi Malik: కుస్తీ వదిలేస్తున్నా.. ఏడ్చేసిన సాక్షీ మాలిక్