న్యూఢిల్లీ, ఆగస్టు 16: సుప్రీంకోర్టు గతంలో కొట్టివేసిన ప్రొవిజన్లతో మళ్లీ ట్రిబ్యునళ్ల బిల్లును రూపొందించి, తీర్పును తిప్పివేయడానికి ఎలాంటి చర్చ లేకుండా పార్లమెంటులో ఆమోదించడం చాలా తీవ్రమైన అంశమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృతంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇటీవల ముగిసిన వర్షాకాల సమావేశాల్లో ట్రిబ్యునళ్ల సంస్కరణ బిల్లు- 2021కు పార్లమెంటు ఆమోదం తెలిపింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరును సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఈ బిల్లు ప్రకారం పలు ట్రిబ్యునళ్లు రద్దవుతాయి. ‘ఈ కోర్టు కొట్టివేసినవి మళ్లీ వెనక్కి ఎలా వచ్చాయో రెండు రోజుల కిందట చూశాం. దీనిపై పార్లమెంటులో చర్చ జరిగిందని నేను భావించడం లేదు. చట్టాలను చేయడానికి పార్లమెంటుకు హక్కు ఉంది. కానీ ఆర్డినెన్స్ను కొట్టివేసిన తర్వాత దాన్నే ప్రభుత్వం బిల్లుగా తీసుకురావడానికి కారణాలు ఏమిటో మేం తెలుసుకోవాలి’ అని సీజేఐ పేర్కొన్నారు. ఈ ధర్మాసనంలో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ అనిరుద్ధ బోస్ కూడా ఉన్నారు. దేశంలో చట్టాలను చేస్తున్న తీరు విచారకరంగా ఉన్నదని స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో సీజేఐ అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంతో తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పార్లమెంటులో చర్చ జరుగకుండా చట్టాలను చేస్తున్నారని సీజేఐ ఆ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. గతంలో ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతూ జస్టిస్ ఎల్ నాగేశ్వరావు ఇచ్చిన తీర్పులోని కొన్ని పేరాలను సీజేఐ స్వయంగా చదివారు. అలాగే పార్లమెంటులో కేంద్ర మంత్రి చేసిన ప్రకటనను సీజేఐ చదివి వినిపించారు. ట్రిబ్యునళ్లపై ఆర్డినెన్స్ను రాజ్యాంగబద్ధతపరంగా సుప్రీంకోర్టు కొట్టివేయలేదని, కొన్ని అంశాలపై సందేహాలను మాత్రమే లేవనెత్తిందన్నది ఆ ప్రకటన సారాంశం. ప్రభుత్వం ఇలా తన చర్యలను సమర్థించుకోవడాన్ని కూడా సీజేఐ తప్పుపట్టారు. కేంద్ర ప్రభుత్వం వివిధ ట్రిబ్యునళ్లలో నియామకాలు చేపట్టకపోవడంపై కూడా సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ట్రిబ్యునళ్లలో ఖాళీలను 10 రోజుల్లో భర్తీ చేయాలని, లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ట్రిబ్యునళ్లను కొనసాగించాలా? మూసేయాలా? అని ఈ సందర్భంగా సీజేఐ ప్రశ్నించారు. కేంద్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్కు నియామకాలు జరుగుతున్నాయని, మిగతావాటికి కూడా త్వరలో పూర్తిచేస్తామని ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు.
‘పెగాసస్’పై నిపుణుల కమిటీ
అనుమానాలు, ఊహాగానాలు, మీడియాలో వచ్చిన నిరాధారమైన కథనాల ఆధారంగానే పెగాసస్ గూఢచర్యం ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు జరుపాలంటూ పలువరు పిటిషన్లు దాఖలు చేశారని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. స్వార్థ ప్రయోజనాల కోసం ప్రచారం చేసిన తప్పుడు కథనాలను అడ్డుకునేందుకు, లేవనెత్తిన అంశాలను పరిశీలించేందుకు నిపుణుల కమిటీని నియమిస్తామని పేర్కొంది. ఈ మేరకు సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. పెగాసస్ విషయంలో ప్రభుత్వ వైఖరిని కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ఇప్పటికే స్పష్టం చేశారని, ఇందులో దాచడానికి ఏమీ లేదని తెలిపింది. పిటిషనర్ల ఆరోపణలను ఖండిస్తున్నట్టు పేర్కొంది.
ఎక్స్గ్రేషియా మార్గదర్శకాలపై కేంద్రానికి 4 వారాల గడువు
కరోనా న్యూఢిల్లీ, ఆగస్టు 16: మృతుల కుటుంబాలకు నష్టపరిహారంపై మార్గదర్శకాల రూపకల్పనకు కేంద్రానికి సుప్రీంకోర్టు మరో 4 వారాల గడువు ఇచ్చింది. మార్గదర్శకాలను రూపొందించే ప్రక్రియ పురోగతిలో ఉన్నదని, వాటిని ఖరారు చేసి అమలు చేయడానికి ముందు మరింత లోతైన పరిశీలన అవసరమని కేంద్రం తెలియజేయడంతో గడువును పొడిగించడానికి కోర్టు సమ్మతించింది. 6 వారాల్లో మార్గదర్శకాలను రూపొందించాలని జూన్ 30న జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షాతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. అదే రోజు తాము జారీ చేసిన ఇతర ఆదేశాల అమలు ఎంతవరకు వచ్చిందని ప్రశ్నించింది. దీనిపై నివేదికను అందజేయాలని ఆదేశిస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.