Dengue | కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru) మహానగరంలో డెంగ్యూ (Dengue) వైరస్ విజృంభిస్తోంది. డెంగ్యూ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మే 1వ తేదీ నుంచి 13వ తేదీ వరకు బెంగళూరు నగరంలో ఏకంగా 172 డెంగ్యూ కేసులు బయటపడ్డాయి. దీంతో నగరంలో హై అలర్ట్ (high alert) ప్రకటించారు. ఈ మేరకు బృహత్ బెంగళూరు మహానగర పాలిక (Bruhat Bengaluru Mahanagara Palike) సంస్థ కమిషనర్ వికాస్ కిషోర్ వెల్లడించారు. డెంగ్యూ వైరస్ విస్తరించకుండా నివారణ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
ఈ డెంగ్యూ వైరస్ బెంగళూరు నగరంలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా విజృంభిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి ఇప్పటి వరకూ ఏకంగా 2,877 డెంగ్యూ కేసులు నమోదైనట్లు చెప్పారు. గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య అధికంగా ఉందన్నారు. గతేడాది ఇదే సమయంలో 1,725 డెంగ్యూ కేసులు నమోదైనట్లు వివరించారు. మరోవైపు వైరస్ వ్యాప్తి కట్టడికి కర్ణాటక ఆరోగ్య విభాగం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు.
నగరంలో ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయాయని.. దీని కారణంగా వైరస్ వ్యాప్తి అధికంగా ఉందన్నారు. మే 16న జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా వైరస్ వ్యాప్తి కట్టడిపై నగర ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు ‘వర్షం పడిన తర్వాత నీరు నిలవడంతో దోమలు వృద్ధి చెందుతాయి. దోమల కారణంగా వైరస్ వ్యాప్తి చెందుతుంది. దీంతో నీటి నిల్వ ప్రాంతాలను గుర్తించి.. ఆయా ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాం. రసాయనాలు పిచికారీ చేయించాం’ అని వికాస్ కిషోర్ తెలిపారు.
Also Read..
Sobhita Dhulipala | కేన్స్లో శోభిత మెరుపులు.. అతియా శెట్టి డ్రెస్ను రిపీట్ చేసిన నటి
Rains | బీ అలర్ట్.. రాత్రి 8లోపు హైదరాబాద్లో భారీ వర్షం..!