Arvind Kejriwal : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బ్లడ్ షుగర్ పెరిగేందుకు స్వీట్లు, పండ్లు తింటున్నారని ఈడీ పేర్కొనడం పచ్చి అబద్దమని ఢిల్లీ మంత్రి, ఆప్ నేత అతిషి అన్నారు. షుగర్ లెవెల్ను నియంత్రించేందుకు కేజ్రీవాల్ రోజూ 54 యూనిట్ల ఇన్సులిన్ తీసుకుంటారని, మధుమేహం అధికంగా ఉండేవారు ఇన్ని యూనిట్ల ఇన్సులిన్ తప్పక తీసుకోవాలని చెప్పారు. మధుమేహంతో బాధపడేవారు వారు తినే ఆహారం, వ్యాయామంపై కఠినంగా వ్యవహరిస్తారని తెలిపారు.
అందుకే కోర్టు ఆయనకు ఇంటి నుంచి ఆహారం తెప్పించుకునే వెసులుబాటు కల్పించిందని అతిషి గుర్తుచేశారు. కానీ బీజేపీ తన జేబు సంస్ధ ఈడీ సాయంతో అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని, ఆయనకు ఇంటి నుంచి ఆహారం అందకుండా చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కాగా, మద్యం పాలసీ కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఉద్దేశపూర్వకంగా మామిడిపండ్లు, స్వీట్లు తింటున్నారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆరోపించింది. టీలో ఎక్కువ పంచదార వంటి చర్యల ద్వారా షుగర్ లెవల్స్ పెంచుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని విమర్శించింది.
తన బ్లడ్ షుగర్ లెవల్స్ హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయని అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తన షుగర్ లెవల్స్ను నిరంతరం పర్యవేక్షించాలని, వారానికి మూడుసార్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన వైద్యుడ్ని సంప్రదించేందుకు అనుమతించాలని కోరుతూ ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ తరుఫు న్యాయవాది జోహెబ్ హొస్సేన్ కోర్టులో వాదనలు వినిపించారు. షుగర్ లెవల్స్ పెంచుకునేందుకు కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగా మామిడిపండ్లు, స్వీట్లు తింటున్నారని ఆరోపించారు.
Read More :
Nampally Court | నాంపల్లి కోర్టులో కరెంట్ కట్.. చీకట్లోనే వాదనలు విన్న జడ్జి