న్యూఢిల్లీ: ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ( Arvind Kejriwal) సీబీఐ విచారణ ముగిసింది. ఆదివారం ఉదయం 11 గంటల నుంచి సుమారు 9 గంటల పాటు సీబీఐ అధికారులు ఆయనను ప్రశ్నించారు. అయితే కేజ్రీవాల్ను సీబీఐ అరెస్ట్ చేయవచ్చంటూ ఊహాగానాలు వినిపించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతలు ఆదివారం సాయంత్రం అత్యవసర సమావేశం (AAP emergency meeting) నిర్వహించారు. ఆప్ జాతీయ కార్యదర్శి పంకజ్ గుప్తా, ఢిల్లీ మేయర్ షెల్లీ ఒబెరాయ్, డిప్యూటీ మేయర్ ఆలే మహమ్మద్ ఇక్బాల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆప్ ఆఫీస్ బేరర్లు, జిల్లా అధ్యక్షులు, జాతీయ కార్యదర్శులు, పార్టీ నాయకులు కూడా హాజరు కావాలని పిలుపునిచ్చారు. తమ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను సీబీఐ అరెస్ట్ చేయవచ్చని ఆప్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ ఫోబియాతో బీజేపీ బాధపడుతున్నదని, అందుకే ఇలాంటి చర్యలకు దిగుతున్నదని విమర్శించారు. తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై వారు చర్చించారు.
కాగా, సీఎం కేజ్రీవాల్ను సీబీఐ ప్రశ్నించడంపై ఆప్ ముఖ్య నేతలు, కార్యకర్తలు భారీ నిరసనకు దిగారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్, ఆప్ మంత్రి అతిషి, ఆప్ నేతలు రాఘవ్ చద్దా, సంజయ్ సింగ్, జాస్మిన్ షా, ఇతర పార్టీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే కేజ్రీవాల్ను ప్రశ్నించిన సీబీఐ ప్రధాన కార్యాలయం వద్ద భారీ స్థాయిలో పోలీసులను మోహరించారు. అక్కడ ఎవరూ గుమిగూడకుండా 144 సెక్షన్ విధించారు.
Also Read: