Arvind Kejriwal | ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు (Delhi Liquor Policy Case)లో ఈడీ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు (Supreme Court). ఈ మేరకు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయాన్ని ఆప్ వర్గాలు బుధవారం వెల్లడించాయి.
కాగా, తన అరెస్ట్ను సవాల్ చేస్తూ కేజ్రీ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. అయితే, ఆ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. ఈడీ వద్ద తగిన ఆధారాలున్నాయని, అందుకే కేజ్రీ పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు న్యాయస్థానం పేర్కొంది. సీఎం అరెస్ట్, రిమాండ్ చట్టవిరుద్ధం కాదని వ్యాఖ్యానించింది. దీంతో కేజ్రీ తాజాగా దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ మేరకు సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ వేసినట్లు ఆప్ వర్గాలు వెల్లడించాయి. అత్యవసర విచారణ కోరుతూ కేజ్రీవాల్ తరఫు న్యాయవాదులు బుధవారం ఉదయం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం ముందు హాజరుకానున్నట్లు తెలిపాయి. దీంతో కేజ్రీ అత్యవసర పిటిషన్ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరిస్తుందా..? లేదా..? అనే దానిపై ఆప్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.
మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు ఢిల్లీ హైకోర్టులో ఊరట దక్కలేదు. తన అరెస్టు, రిమాండ్ను సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. కేజ్రీవాల్ అరెస్టు, రిమాండ్ చట్టవిరుద్ధం కాదని వ్యాఖ్యానించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ స్వరణ కాంత శర్మ మంగళవారం తీర్పు వెలువరించా రు. కేజ్రీవాల్ అరెస్టుకు ఈడీ వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మంత్రి సౌరవ్ భరద్వాజ్ మీడియాతో మాట్లాడుతూ మద్యం పాలసీ కేసు కేజ్రీవాల్, ఆయన పార్టీని అణచివేసేందుకు జరిగిన ఒక పెద్ద రాజకీయ కుట్ర అని ఆరోపించారు. హైకోర్టు తీర్పు తమకు ఆమోదయోగ్యంగా లేదని, దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్తామని తెలిపారు. మద్యం పాలసీ కేసుల్లో దర్యాప్తు చేస్తున్న ఈడీ, సీబీఐ ఇప్పటి వరకు ఒక్క రూపాయి అక్రమ సొమ్ము కూడా రికవరీ చేయలేదని అన్నారు. ఈ కేసు ఒక రాజకీయ కుట్ర అని వ్యాఖ్యానించారు.
Also Read..
Lok Sabha Elections | ఓటేయాలంటూ తల్లిదండ్రులకు లక్ష పోస్టు కార్డులు
Farmers | బీజేపీకి రైతు సెగ.. ప్రచారానికి వస్తే అభ్యర్థులను అడిగేందుకు 11 ప్రశ్నలు సిద్ధం