లక్నో, ఏప్రిల్ 9: కేంద్రంలో అధికారం చేపట్టేందుకు దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన, 80 లోక్సభ స్థానాలు కలిగిన ఉత్తరప్రదేశ్ చాలా ముఖ్యమైనది. ఆ రాష్ట్రంలో చాలా మంది బలమైన మహిళా నేతలు ఉన్నారు. అయితే ఆసక్తికరంగా వారిలో మెజార్టీ మంది స్థానికేతరులే కావడం గమనార్హం.
సోనియాగాంధీ: కాంగ్రెస్ నేత సోనియా గాంధీ ఇటలీ దేశానికి చెందిన వ్యక్తి. ఆమె రాజీవ్ గాంధీని వివాహం చేసుకొన్న తర్వాతి నుంచి న్యూఢిల్లీలో నివాసం ఉంటున్నారు. యూపీలోని అమేథీ నుంచి 1999లో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన సోనియా.. 2004 నుంచి 2019 వరకు అదే రాష్ట్రంలోని రాయ్బరేలీ నుంచి పోటీచేస్తూ వచ్చారు.
మాయావతి: ఢిల్లీలో జన్మించిన బీఎస్పీ అధినేత్రి మాయావతి.. యూపీని తన రాజకీయ కర్మభూమిగా మార్చుకొన్నారు. పలు మార్లు ఏకంగా రాష్ర్టానికి సీఎంగా చేసిన ఆమె.. ఒక బలమైన నేతగా ఎదిగారు.
స్మృతి ఇరానీ: అమేథీ నుంచి వరసగా రెండోసారి గెలుపొందాలని ఉవ్విళ్లూరుతున్న కేంద్ర మంత్రి స్మృతిఇరానీ వాస్తవానికి ఢిల్లీ వాస్తవ్యురాలు. 2019లో ఆమె అమేథీ నుంచి గెలిచిన తర్వాత.. తనకు తాను ‘అమేథీ బిడ్డ’గా చెప్పుకొన్నారు.
మేనకాగాంధీ: ఢిల్లీకి చెందిన మేనకాగాంధీ, 1989లో జనతాదళ్ టికెట్పై ఎంపీగా గెలిచారు. తర్వాత బీజేపీలో చేరి..పోటీచేసేందుకు మొదట పిలిబిత్, తర్వాత సుల్తాన్పూర్ ఎంచుకొంటున్నారు.
హేమమాలిని: రాజకీయ నేతగా మారిన నటి హేమమాలిని ప్రస్తుతం యూపీలోని మథుర నుంచి వరుసగా మూడోసారి పోటీచేస్తున్నారు. తమిళనాడుకు చెందిన ఆమె తన జీవితకాలంలో అత్యధికంగా ముంబైలో గడిపారు.
జయప్రద: నటి నుంచి రాజకీయ నేతగా మారిన జయప్రద.. రాజమండ్రిలో జన్మించారు. మొదట టీడీపీలో చేరిన ఆమె, ఆ తర్వాత తన రాజకీయ భవిష్యత్తు కోసం ఉత్తరప్రదేశ్కు వెళ్లారు.
డింపుల్ యాదవ్: ఎస్పీ అధినేత అఖిలేశ్ భార్య డింపుల్ యాదవ్ ఉత్తరాఖండ్కు చెందిన వ్యక్తి. ఆమె అఖిలేశ్ను పెండ్లి చేసుకొన్న తర్వాత యూపీని తన ఇంటిగా మార్చుకొన్నారు. 2022లో ములాయం మరణం తర్వాత మెయిన్పురి ఉప ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు.