Farmers | చండీగఢ్, ఏప్రిల్ 9: లోక్సభ ఎన్నికల్లో అధికార బీజేపీని పంజాబ్, హర్యానాలో రైతులు గట్టి దెబ్బ కొట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నూతన సాగు చట్టాల ఎపిసోడ్ నుంచి కమలం పార్టీ రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నది. మోదీ సర్కార్ హామీలతో ఏడాది పాటు సాగిన రైతాంగ ఉద్యమాన్ని విరమించిన అన్నదాతలు.. ఇప్పుడు ఆ హామీలను నెరవేర్చడంలో కేంద్రం మోసం చేసిందని ఆగ్రహంగా ఉన్నారు. డిమాండ్ల సాధనకు చేపట్టిన ‘ఢిల్లీ చలో’కు అడ్డంకులు సృష్టించడంపై మండిపడుతున్నారు. ఈ క్రమంలో లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి తగిన విధంగా బుద్ధి చెబుతామని పంజాబ్, హర్యానా రైతులు హెచ్చరిస్తున్నారు. బీజేపీ అభ్యర్థులను ఓడించాలని రైతు సంఘాల నేతలు ప్రజలకు పిలుపునిచ్చారు. బీజేపీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారానికి వచ్చిన సమయంలో అడిగేందుకు 11 ప్రశ్నలను సిద్ధం చేశారు. ఇందులో ఎంఎస్పీకి చట్టబద్ధత, రైతు రుణాల మాఫీ, ఇటీవల చేపట్టిన ‘ఢిల్లీ చలో’ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయి.
ఓట్లడిగే హక్కు ఆ పార్టీకి లేదు..
ఎస్కేఎం సీనియర్ నేత, ఆలిండియా కిసాన్ ఫెడరేషన్ అధ్యక్షుడు ప్రేమ్ సింగ్, బీకేయూ(లఖోవాల్) మీడియాతో మాట్లాడుతూ బీజేపీ సర్కార్ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఒక ‘రైతు, ప్రజాస్వామ్య, సమాఖ్య’ వ్యతిరేక పార్టీ అని, కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. ప్రజలను ఓట్లడిగే హక్కు ఆ పార్టీకి లేదని, ఆ పార్టీని ప్రజాస్వామిక, శాంతియుత పద్ధతిలో వ్యతిరేకిస్తామని, ప్రశ్నిస్తామని ప్రేమ్ సింగ్ పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను ఓడించాలని వారు ప్రజలకు పిలుపునిచ్చారు. బీజేపీ అభ్యర్థులను ప్రశ్నించేందుకు తాము సిద్ధం చేసిన ప్రశ్నలను రెండు రాష్ర్టాల రైతులకు పంపుతామని తెలిపారు.
పలు గ్రామాల్లో ప్రవేశం నిషేధం
మరోవైపు ఇప్పటికే పంజాబ్, హర్యానాల్లోని పలు గ్రామాల్లోకి బీజేపీ నేతల ప్రవేశాన్ని నిషేధించారు. ‘రైతులను ఢిల్లీలోకి రానివ్వలేదు. గ్రామాల్లోకి బీజేపీ నేతలు రాకుండా నిషేధిస్తున్నాం’ అని రైతులు పోస్టర్లు ఏర్పాటు చేశారు. ఇటీవల ‘ఢిల్లీ చలో’ ఆందోళన కార్యక్రమంలో పంజాబ్ సరిహద్దుల్లో మరణించిన యువరైతు శుభకరణ్కు నివాళిగా కొన్ని గ్రామాల్లో బ్యానర్లు ఏర్పాటు చేశారు. ‘నేను చేసిన తప్పేంటి? మీ(కేంద్ర ప్రభుత్వం) హమీలను గుర్తుచేయడానికే ఢిల్లీ రావాలనుకొన్నాను’ అని అందులో రాసివున్నది.
రైతుల 11 ప్రశ్నలు