Anand Mahindra | ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఆసక్తికర విషయాలను నెటిజన్లతో పంచుకుంటూ ఉంటారు. వర్తమాన అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడిస్తుంటారు. అయితే, తాజాగా ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ ద్వారా ఎమోషనల్ అయ్యారు. ముంబై ప్రజా రవాణాలో 80 ఏళ్లకు పైగా కీలక పాత్ర పోషించిన ఎరుపు రంగు డబుల్ డెక్కర్ బస్సులకు ( iconic red double decker buses) అధికారులు మరో వారం రోజుల్లో వీడ్కోలు పలకబోతున్నారు. దీంతో ఆనంద్ మహీంద్రా భావోద్వేగానికి గురయ్యారు. ‘హలో ముంబై పోలీస్.. నా చిన్ననాటి జ్ఞాపకాల్లో ఒకదాన్ని దొంగలించడాన్ని మీకు ఫిర్యాదు చేయాలనుకుంటున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
Hello, Mumbai Police? I’d like to report the theft of one of my most important childhood memories. 😞 https://t.co/Lo9QHJBVDW
— anand mahindra (@anandmahindra) September 15, 2023
ఓపెన్-డెక్ డబుల్ డెక్కర్ బస్సులు (open-deck double-decker buses) 1990 నుంచి నగర పర్యటనకు వచ్చిన వారికి సేవలందిస్తున్నాయి. 2008 నుంచి వాటి నిర్వహణను అధికారులు నిలిపివేశారు. తాజాగా ఈ బస్సులకు వీడ్కోలు పలకాలని అధికారులు నిర్ణయించారు. మరో వారం రోజుల్లో ఇవి ముంబై రోడ్ల నుంచి మాయం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే బస్సులకు ముంబైలో వీడ్కోలు పలికేందుకు నిన్న పలువురు బస్ డ్రైవర్లు, కండక్టర్లు, ప్రయాణికులు ఒక చోట చేరారు. మరోవైపు, ఈ ఐకానిక్ బస్సుల్లో రెండింటినైనా మ్యూజియంలో భద్రపరచాలని స్థానికులు కోరుతున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి, పర్యాటకశాఖ మంత్రి, బృహన్ ముంబై ఎలక్ట్రిసిటీ సప్లై అండ్ ట్రాన్స్పోర్ట్ అండర్ టేకింగ్ (బెస్ట్)కు ప్రయాణికులు లేఖలు రాశారు.
కాగా, 1937లో మొదటి సారిగా ఈ ఎరుపు రంగు డబుల్ డెక్కర్ బస్సులను అధికారులు ప్రవేశపెట్టారు. ముంబై ప్రజా రవాణాలో 80 ఏళ్లకు పైగా ఈ బస్సులు కీలక పాత్ర పోషించాయి. పలు బాలీవుడ్ చిత్రాల్లో కూడా ఈ బస్సులను వాడారు. క్రమంగా వాటి సంఖ్య పెరుగుతూ వచ్చింది. 1990 కల్లా వీటి సంఖ్య 900కి చేరింది. ఆ సమయంలో ఈ బస్సులు ముంబై నగరంలో ఓ వెలుగు వెలిగాయి. అయితే, కొన్ని రోజులకు క్రమంగా వాటి సంఖ్య తగ్గుతూ వచ్చింది. వాటి నిర్వహణ ఖర్చు భారీగా పెరిగిపోతుండటంతో 2008 తర్వాత వాటి సేవలను బృహన్ ముంబై ఎలక్ట్రిసిటీ సప్లై అండ్ ట్రాన్స్పోర్ట్ అండర్ టేకింగ్ (బెస్ట్) నిలిపివేసింది. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ ఐకానిక్ ఎరుపు బస్సుల స్థానంలో బ్యాటరీతో నడిచే నలుపు రంగు డబుల్ డెక్కర్ బస్సులను లీజుకు తీసుకున్నారు. ప్రస్తుతం ఇవి 25 వరకు ఉన్నాయి.
Also Read..
Singer | సంగీత కచేరీలో ప్రముఖ గాయనిపై నోట్ల వర్షం.. వీడియో
SIIMA Awards -2023 | ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్.. ఉత్తమ నటిగా శ్రీలీల.. అట్టహాసంగా సైమా అవార్డుల వేడుక