న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 96 నియోజకవర్గాల్లో సోమవారం జరిగిన లోక్సభ ఎన్నికల (Lok Sabha elections) నాలుగో దశ పోలింగ్లో 63 శాతానికిపైగా ఓటింగ్ నమోదైంది. పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా 76.02 శాతం పోలింగ్ నమోదు కాగా, మధ్యప్రదేశ్లో 68.48 శాతం పోలింగ్ నమోదైంది. మహారాష్ట్రలో 52.63 శాతం, జమ్ముకశ్మీర్లో 36.88 శాతం మేర కనిష్ఠ పోలింగ్ నమోదైంది.
కాగా, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో లోక్సభ స్థానాలతోపాటు అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది.
ఆంధ్రప్రదేశ్లో 68.12 శాతం, జార్ఖండ్లో 63.37 శాతం, ఒడిశాలో 63.85 శాతం, తెలంగాణలో 61.29 శాతం, ఉత్తరప్రదేశ్లో 57.76 శాతం, బీహార్లో 55.9 శాతం పోలింగ్ నమోదైంది. తుది పోలింగ్ శాతాలు పెరిగే అవకాశముంది. పశ్చిమ బెంగాల్, ఒడిశాలోని కొన్ని బూత్లలో ఈవీఎంలు పనిచేయలేదని నివేదికలు వచ్చాయి.
మరోవైపు దేశ వ్యాప్తంగా పోలింగ్ చాలా వరకు ప్రశాంతంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో హింసాత్మక సంఘటనలు నమోదయ్యాయి. ఏపీలో టీడీపీ, వైఆర్సీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరుగ్గా, బెంగాల్లో టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య గొడవలు జరిగాయి. ఈ ఘర్షణల్లో పలువురు గాయపడ్డారు.
కాగా, లోక్సభ ఎన్నికల తొలి మూడు దశల్లో వరుసగా 66.14 శాతం, 66.71 శాతం, 65 68 శాతం మేర పోలింగ్ నమోదైంది.