ఈ ఏడాది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1.67 లక్షల ఎకరాల్లో సాగు
గతేడాదికంటే అదనంగా 40,600 ఎకరాలు..
వ్యవసాయశాఖ ప్రోత్సాహంతో ఏటేటా పెరుగుతున్న సాగు విస్తీర్ణం
అందుబాటులో కొనుగోలు కేంద్రాలు n మద్దతు ధర అందిస్తున్న సర్కారు
ఆశాజనకంగా కంది దిగుబడులు.. ఆసక్తి చూపుతున్న రైతులు
ఆదిలాబాద్ ప్రతినిధి, జూన్ 25 (నమస్తే తెలంగాణ) :కంది పంట లాభసాటిగా మారుతున్నది. ఏటా దిగుబడులు ఆశాజనకంగా ఉండడంతో పాటు సర్కారు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర కల్పిస్తుండడంతో రైతాంగం ఆసక్తి చూపుతున్నది. ఈ ఏడాది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 1.67 లక్షల ఎకరాల్లో సాగవుతున్నట్లు వ్యవసా య శాఖ అంచనా వేస్తున్నది. గతేడాదికంటే ఈసారి 40,600 ఎకరాల్లో అదనంగా పెరుగగా, అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నది. కాగా, ఏటా వానకా లంలో సోయాబీన్, పత్తి సాళ్లలో అంతర్పంటగా ఇది సాగవుతుండగా, అధికారులు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తూ ప్రోత్సహిస్తున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైతులు వానకాలంలో తొగరి (కంది) పంటను సాగు చేస్తారు. పత్తి, సోయాబీన్ పంటలో అంతర్ పంటగా కందిని వేస్తారు. ఆరు నుంచి ఎనిమిది సాళ్లకు ఒకసాలు చొప్పున కందిని వేస్తారు. రైతులు ఎన్నో ఏళ్లుగా ఆహార పంటగా పండిస్తున్నారు. పత్తి పంటను వేసిన రైతులు యాసంగిలో శనగ, గోధుమ పంటను సాగు చేస్తారు. తాతల కాలం నుంచి పత్తి, కంది పంటలను పండిస్తున్నారు. సాగు పద్ధతులు, పంటలు నష్టపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంలో ఇక్కడి రైతులకు మంచి అవగాహన ఉంది. పంటల సాగులో అనుభవంతో పాటు వ్యవసాయ అధికారులు సలహాలు, సూచనలు పాటిస్తూ నష్టాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పంట సాగు లాభసాటిగా మారడం, ప్రభుత్వం ఏటా మద్దతు ధరను పెంచడం, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా పంటను కొనుగోలు చేస్తుండడంతో ఏటా కంది సాగు విస్తీర్ణం పెరుగుతున్నది. గతేడాది కందులకు మద్దతు ధర క్వింటాకు రూ. 5800 ఉండగా, ఈ ఏడాది ప్రభుత్వం రూ.6000కు పెంచింది. జిల్లాలో ప్రైవేట్ వ్యాపారులు మద్దతు ధరకంటే ఎక్కువ చెల్లించి కందులను కొనుగోలు చేస్తారు. సేకరించిన పంటను మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకు ఎగుమతి చేస్తారు.
కంది విత్తనాల ప్రతిపాదనలు..
మంచిర్యాల జిల్లాలో వానకాలంలో ప్రధానంగా పత్తి, వరి, కందులు, మినుములు, పెసలు పంటలు వేస్తుంటారు. కాగా జిల్లాకు సంబంధించిన వరి, పత్తి, పెసర, మొక్కజొన్న, పల్లి, మినుములు, పెసలు, కందులకు సంబంధించిన ఇండెంట్ను మండలాల వారీగా తయారు చేశారు. జిల్లాలో 18 మండలాల వారీగా ఇండెంట్ తయారు చేసి నివేదికలు పంపించారు. ప్రధానంగా కందులు 880 క్వింటాళ్లు అవసరం ఉంటుందని అధికారులు అంచనా వేశారు. మండలాల వారీగా కందుల అవసరాన్ని పరిశీలిస్తే.. బెల్లంపల్లి 64 క్వింటాళ్లు, కాసిపేట 84, తాండూర్ 140.4, భీమిని 69.6, కన్నెపల్లి 24.8, నెన్నెల 26.4, వేమనపల్లి 28, భీమారం 22.4, చెన్నూర్ 36.4, జైపూర్ 45.6, కోటపల్లి 42.4, మందమర్రి 72.8, దండేపల్లి 81.6, హాజీపూర్ 24, జన్నారం 52.4, లక్షెట్టిపేట 58.8, మంచిర్యాల 4.8, నస్పూర్ మండలంలో 1.6 క్వింటాళ్లు కాగా, జిల్లా వ్యాప్తంగా 880 క్వింటాళ్లు అవసరమని వ్యవసాయ అధికారులు అంచనావేశారు. కంది పంట సాగును ప్రోత్సహించడానికి వ్యవసాయ శాఖ అధికారులు సైతం కృషి చేస్తున్నారు. పంట సాగు వల్ల కలిగే ప్రయోజనాలు వివరిస్తూ, మార్కెటింగ్ ఇతర విషయాలపై రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు.
ఈ సీజన్లో 1.67 లక్షల ఎకరాల్లో సాగు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది వానకా లంలో 1.67 లక్షల ఎకరాల్లో కంది పంటను సాగు చేయను న్నారు. గతేడాది లక్షా 26 వేల 400 ఎకరాల్లో కంది సాగు చేశారు. ఈ ఏడాది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 40 వేల 600 ఎకరాలు అదనంగా సాగు విస్తీర్ణం పెరుగనున్నది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో గతేడాది 35 వేల ఎకరాల్లో రైతులు కంది పంటను సాగు చేయగా, ఈ ఏడాది 46 వేల ఎకరాల్లో పండించ నున్నట్లు అధికారులు అంచనా వేశారు. ఆదిలాబాద్ జిల్లాలో గతేడాది 62 వేల ఎకరాల్లో కందిని పండించగా, ఈ ఏడాది 80 వేల ఎకరాల్లో సాగు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. నిర్మల్ జిల్లాలో గతేడాది 23 వేల ఎకరాల్లో పంట సాగు కాగా, ఈ ఏడాది వానకాలంలో 30 వేల ఎకరాల్లో రైతులు కంది సాగు చేయనున్నట్లు అధికారులు అంచనా వేశారు.
మంచిర్యాల జిల్లాలో..
జిల్లాలోకందిసాగు విస్తీర్ణం పెరుగుతున్నది. గతేడాది 6,400 ఎకరాల్లో సాగయ్యింది. ఈ ఏడాది 11 వేల ఎకరాల్లో వేస్తున్నట్లు వ్యవసాయ శాఖ అంచనావేస్తున్నది. కందికి పెట్టుబడి తక్కువ కావడం, గిట్టుబాటు ధర ఉండడంతో రైతులు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తున్నది. బెల్లంపల్లి మండలంలో 800 ఎకరాలు, కాసిపేటలో 1,050, తాండూర్ 1,755, భీమిని 870, కన్నెపల్లి 310, నెన్నెల 330, వేమనపల్లి 350, భీమారం మండలంలో 280 ఎకరాల్లో సాగవుతున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. చెన్నూర్ మండలంలో 455, జైపూర్ 570, కోటపల్లి 530, మందమర్రి 910, దండేపల్లి 1,020, హాజీపూర్ 300, జన్నారం 655, లక్షెట్టిపేట 735, మంచిర్యాల 60, నస్పూర్ 20 ఎకరాల్లో కలుపుకొని జిల్లా వ్యాప్తంగా 11,000 ఎకరాల్లో సాగవుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
సార్లు విత్తనాలిచ్చిన్రు
మేము యేటా పత్తిల తొగరి(కంది) సాళ్లు ఏస్తము. రెండున్నర ఎకరాల్లో పత్తి వేసిన. 8 పత్తి సాళ్లకు.. ఒగ తొగరి సాలు పెట్టిన. పోయినేడాది తొగరి మంచిగ పండింది. గీయింత భూమిలనే 5 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. 4 క్వింటాళ్లు అమ్మినం. మిగిలినవి తినేతందుకు ఉంచుకు న్నం. సర్కారు సుకా మంచి ధరపెట్టి తొగళ్లు కొన్నది. ఈ యేడాది ఇంత ఎక్కువనే వేసినం. మొన్ననే సార్లు అచ్చి నాలుగు కిలోల విత్తనాలి చ్చిన్రు. తొగరి పప్పును మా తాతల కాలం నుంచి ఇప్పటిదాకా దుకాండ్లళ్ల కొన్నది లేదు.