నిర్మల్ టౌన్, ఏప్రిల్ 24 : గురుకులాల్లో ప్రవేశాలు ప్రారంభం అయ్యాయి. పోటీ పరీక్ష నెగ్గి తమ పిల్లలకు సీటు రావడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో ఐదో తరగతిలో ప్రవేశాల కొరకు ప్రవేశ పరీక్ష నిర్వహించగా.. ప్రతిభ ఆధారంగా విద్యార్థుల మెరిట్ జాబితాను ప్రభుత్వం మూడు రోజుల క్రితం ప్రకటించింది. ఈ మేరకు గురుకుల పాఠశాలలకు కేటాయిస్తు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. సీట్లు సాధించిన విద్యార్థులు మే 2వ తేదీలోపు పాఠశాలలో ప్రవేశం రిపోట్ చేయాలని సూచించింది. దీంలో సీటు సాధించిన విద్యార్థులు ఆయా పాఠశాలకు వెళ్లి తాము ప్రవేశం తీసుకుంటున్నట్లు రిపోర్ట్ చేస్తున్నారు. యేటా మే చివరి వారంలో ప్రవేశాలు పొందగా..ఈసారి నెల రోజుల ముందుగానే ప్రక్రియను ప్రారంభించారు. విద్యార్థుల చదువుకు ఆటంకం కలుగకుండా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అయితే పోటీ పరీక్షలో ప్రతిభ సాధించిన విద్యార్థులు తమకు సీటు రావడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గురుకులాల్లో నాణ్యమైన ఇంగ్లిష్ విద్య, మంచి భోజనం, ఇతర సదుపాయాలు ఉండడంతో సీటు వచ్చిన పేద విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మే 2 లోపు ప్రవేశం పొందాలి..
– గంగా శంకర్, ప్రిన్సిపల్.
గురుకులాల్లో ఐదో తరగతిలో ప్రవేశాల జాబితాను ప్రభుత్వం ప్రకటిం చింది. ఆయా పాఠశాలల జాబితాను పంపి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ప్రతిభ ఆధారంగా సీట్లు రిజర్వేషన్ కేటాయించాం. సీటు పొం దిన విద్యార్థులు మే 2 లోపు అన్ని పత్రాలతో రిపోర్ట్ చేయాలి. గురుకులా ల్లో నాణ్యమైన ఆంగ్ల బోధన, ఇతర సదుపాయాలు కల్పిస్తున్నాం.
చాలా సంతోషంగా ఉంది.
నేను నాలుగో తరగతి వరకు గోల్లమాడలోనే చదివిన. గు రుకుల పాఠశాలలో సీటు సాధించాలనే లక్ష్యంలో కష్టపడి చదివిన. మాసార్లు రోజు గురుకుల పాఠశాల ప్రవేశం కొరకు నిర్వహించే పరీక్ష ఏలా చదివి ఎలా రాయాలో చెప్పారు. అందువల్లనే మాకు సీటు వచ్చింది. ఐదో తరగతి నుంచి 10 తరగతి వరకు ఉచితంగా గురుకలాల్లో చదివేందుకు సీటు రావడం చాలా సంతోషంగా ఉంది. – గణన దీపిక, గొల్లమాడ.
ప్రభుత్వ పాఠశాలలో చదివిన..
మాది నిర్మల్ మండలంలోని న్యూపోచంపాడ్. మా ఊరి ప్రభుత్వ పాఠశాలలో మా కూతురు నయశ్రీని నాలుగో తరగతి వరకు చదివించిన. ఐదో తరగతిలో గురుకులాల్లో ప్రవేశం కోసం పరీక్ష రాస్తే నిర్మల్లోని సోఫినగర్లో సీటు వచ్చింది. ప్రైవేట్లో చదివించే ఆర్థిక స్థోమత మాకు లేదు. మా పాపకు మంచి స్కూల్లో సీటు రావడం సంతోషంగా ఉంది. గురుకులాలను ఏర్పాటు చేయడం వల్లనే పిల్లలకు పోటీ పరీక్షలంటే తెలిసింది. – రజిత, పోచంపాడ్.