ఆదిలాబాద్, ఏప్రిల్ 23(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని పార్టీ అభ్యర్థి ఆత్రం సక్కు తెలిపారు. బుధవారం ఆయన బోథ్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, కోవ లక్ష్మీ, మాజీ మంత్రి జోగు రామన్న, సీనియర్ మైనార్టీ నాయకుడు యూనిస్ అక్బానీతో కలిసి కలెక్టర్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి రాజర్షి షాకు నామినేషన్ సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులు, పేదలు, బడుగు, బలహీన వర్గాల ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారని తెలిపారు. తెలంగాణ ప్రజల హక్కుల పరిరక్షణ, విభజన హామీలు ఇతర సమస్యల గురించి పార్లమెంట్లో గొంతెత్తడానికి బీఆర్ఎస్ ఎంపీలు ఆవశ్యకత ఉందన్నారు. తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష అని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కళ్లబొల్లి మాటలు, ఆచరణలో సాధ్యం కానీ హామీలతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందన్నారు. ఆరు గ్యారెంటీలతోపాటు 420 హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి డిసెంబరు 9న రైతులకు రూ.2 లక్షల రుణ మాఫీని అమలు చేస్తానని చెప్పారని, ఇప్పుడు ఆగస్టు 15 అంటూ దేవుళ్ల మీద ఓట్టేసి కొత్త నాటకాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనియాగాంధీపై నమ్మకం లేక దేవుడిపై ఒట్టు పెడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యక్తిగత ఆరోపణలు మానుకుని గ్యారెంటీల అమలుకు కృషి చేయాలని సూచించారు.
పదేండ్లు అధికారంలో ఉన్న బీజేపీ జిల్లా ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న జిల్లా సమస్యలను ప్రస్తావించకపోవడం శోచనీయమని తెలిపారు. ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమ, విమానాశ్రయం, ఆర్మూర్, ఆదిలాబాద్ రైల్వేలైన్, రెబ్బెన ఓవర్ బ్రిడ్జి వంటి సమస్యలను బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. గత ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు బీజేపీ ఎంపీని గెలిపించినా ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉన్న తాను ప్రజల సమస్యలను పరిష్కరించానని, ప్రజలు తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తుల శ్రీనివాస్, దాసరి రమేశ్, జంగిలి ప్రశాంత్ ఉన్నారు.
ఎదులాపురం, ఏప్రిల్ 23 : లోక్సభ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా మంగళవారం ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఆరో రోజు ఆరు నామినేషన్లు దాఖలు అయ్యాయని జిల్లా రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆత్రం సక్కు రెండు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. అలాగే ఇండియా ప్రజాబంధు పార్టీ నుంచి సాగర్ రెండు నామినేషన్లు, పట్టణానికి చెందిన మెస్రం గంగాదేవి(స్వతంత్ర), ఉట్నూర్ బోయవాడ చవాన్ రాము (స్వతంత్ర) అభ్యర్థికి సంబంధించి నామినేషన్లు దాఖలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, కోవ లక్ష్మి, ఎమ్మెల్సీ దండే విఠల్, బీఆర్ఎస్ నాయకులు జాన్సన్ నాయక్, లోలం శ్యాంసుందర్, రామ్కిషన్రెడ్డి, మరుకోల సరస్వతి, తదితరులు పాల్గొన్నారు.