డెహ్రాడూన్: ఒక పులి తిరుగుతుండటంతో ఆ ప్రాంత వాసులు భయాందోళన (Tiger Terror) చెందుతున్నారు. ఇప్పటికే ఆ పులి ఇద్దరు మనుషులపై దాడి చేసి చంపింది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. పులి సంచరిస్తున్న గ్రామాల్లో రాత్రి 7 నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూ విధించారు. అలాగే రెండు రోజుల పాటు స్కూళ్లు కూడా మూసివేశారు. ఉత్తరాఖండ్లోని పౌరీ గర్హ్వాల్ జిల్లాలో ఈ పరిస్థితి నెలకొన్నది. రిఖానిఖాల్, ధుమాకోట్ మండలాల్లోని పలు గ్రామాల్లో ఒక పులి సంచరిస్తున్నది. ఈ నెల 13న రిఖానిఖాల్ ప్రాంతంలో ఒకరిని, ఈ నెల 15న ధుమాకోట్ ప్రాంతంలో మరో వ్యక్తిని పులి చంపింది. దీంతో ఆ ప్రాంత వాసులు పులి భయంతో హడలిపోతున్నారు.
ఈ నేపథ్యంలో పౌరీ గర్హ్వాల్ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ రెండు మండలాల పరిధిలోని గ్రామాల్లో రాత్రి వేళ కర్ఫ్యూ విధించారు. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఆదేశించారు. అలాగే ఆ రెండు మండలాల పరిధిలోని గ్రామాల్లో ఈ నెల 17, 18న స్కూల్స్ మూసివేయాలని పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.
కాగా, రిఖానిఖాల్, ధుమాకోట్ ప్రాంతాలకు చెందిన ప్రజలు పులి భయంతో వణికిపోతున్నారు. ఆ పులి ఇప్పటికే ఇద్దరిపై దాడి చేసి చంపడంపై ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో పులి ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు క్యాంపులు నిర్వహించాలని, ప్రభావిత ఇళ్లులు, కుటుంబాలను గుర్తించాలని జిల్లా యంత్రాంగం ఆదేశించింది. అలాగే అటవీ శాఖ సిబ్బందితో కలిసి పులిని పట్టుకునేందుకు తగిన చర్యలు చేపట్టాలని సూచించింది. మరోవైపు పులి తిరిగే ప్రాంతాల నివాసితులకు భద్రత కల్పించాలని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామిని స్థానిక ఎమ్మెల్యే కోరారు.
Also Read: