అనంతనాగ్: జమ్ముకశ్మీర్లో ప్రతి ఏటా నిర్వహించే అమర్నాథ్ యాత్ర ఈ ఏడాది కూడా జూలైలో ప్రారంభం కానుంది. జూలై 1వ తేదీ నుంచి శ్రీ అమర్నాథ్ యాత్ర నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 62 రోజులపాటు యాత్ర కొనసాగుతుందన్నారు. జూలై 1న ప్రారంభమయ్యే యాత్ర ఆగస్టు 31న ముగుస్తుందని జమ్ముకశ్మీర్ ప్రభుత్వం ప్రకటించింది.
ఈ యాత్ర కోసం అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్ ట్రాక్లో, గండేర్బల్ జిల్లాలోని బల్తాల్ ట్రాక్లో రిజిస్ట్రేషన్లను ప్రారంభించినట్లు ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. ఆన్లైన్, ఆఫ్లైన్ రెండు విధానాల్లో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని చెప్పారు. ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్లు దేశవ్యాప్తంగా 542 బ్యాంకు శాఖల్లో జరుగుతాయని చెప్పారు.
అందులో 316 పంజాబ్ నేషనల్ బ్యాంక్ శాఖలు, 37 ఎస్ బ్యాంక్ శాఖలు, 99 ఎస్బీఐ బ్యాంక్ శాఖలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ఈసారి రిజిష్ట్రేషన్లలో ఆధార్ బేస్డ్ రిజిస్ట్రేషన్ అనే కొత్త ఫీచర్ను కూడా అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. ఈ విధానంలో యాత్రికుడు తన బొటనవేలి ముద్రను స్కాన్ చేయడం ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు.
ఈ యాత్రకు 13 నుంచి 70 ఏళ్ల మధ్య వయసున్న అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, అయితే యాత్రికుందరూ తప్పనిసరిగా ఆరోగ్య ధ్రువపత్రం తీసుకుని రావాలని అధికారులు సూచించారు. ఆరు వారాలకు మించిన గర్భంతో ఉన్న గర్భవతులకు కూడా యాత్రకు అనుమతి లేదని చెప్పారు.