Onions | ఉల్లి (Onions) ఎగుమతులపై 40 శాతం సుంకం విధిస్తూ (export duty) కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా రైతులు, వ్యాపారులు నిరసన తెలుపుతున్నారు. ఈ మేరకు సుంకం నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో మహారాష్ట్ర మంత్రి (Maharashtra minister) దాదా భూసే ( Dada Bhuse) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ నాలుగు నెలలు వంటలో ఉల్లిపాయ వాడకపోతే ఏమవుతుంది..? అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
‘మీరు రూ. 10 లక్షల విలువైన వాహనాన్ని వాడుతున్నప్పుడు, ఉల్లికి రిటైల్ ధర కంటే రూ.10 లేదా రూ.20 పెరిగినప్పుడు వాటిని కొనుగోలు చేయడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే, ఉల్లిని కొనే స్థోమత లేని వారు.. ఒక రెండు నుంచి నాలుగు నెలలు ఉల్లి తినకుంటే ఏమవుతుంది’ అంటూ వ్యాఖ్యానించారు. అదే సమయంలో ఎగుమతి సుంకం విధింపు నిర్ణయం సరైన సమన్వయంతో తీసుకోవాలని కూడా ఆయన అన్నారు. కొన్ని సార్లు ఉల్లి క్వింటా రూ.200 పలుకుతుందని, మరికొన్ని సార్లు క్వింటా రూ. 2,000 దాకా ఉంటుందని చెప్పారు. అయితే ఒక సామరస్య పూర్వకమైన చర్చ ద్వారా పరిష్కారాన్ని కనుగొనవచ్చునని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మంత్రి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు పెరుగుతాయనే ఆందోళనలతో ఎగుమతులపై కేంద్రం పన్ను విధించిన విషయం తెలిసిందే. ఉల్లి ఎగుమతులపై 40 శాతం సుంకం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. తద్వారా ఎగుమతులకు అడ్డుకట్ట వేసి దేశీయంగా వీటి లభ్యత పెంచేలా చర్యలు తీసుకుంది. కాగా, ఉల్లి ఎగుమతులపై ఇలా పన్ను విధించడం ఇదే తొలిసారి. కస్టమ్స్ నోటిఫికేషన్ రూపంలో కేంద్ర ఆర్థిక శాఖ ఈ పన్ను విధించింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ప్రకారం.. ఈ పన్ను డిసెంబర్ 31వ తేదీ వరకు అమల్లో ఉంటుంది. అయితే, కేంద్రం నిర్ణయంపై రైతులు, వ్యాపారులు భగ్గుమంటున్నారు. ఎగుమతులపై పన్ను విధించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సుంకం నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read..
Chandrayaan-3 | 70 కిలోమీటర్ల దూరం నుంచి జాబిల్లి ఫొటోలు పంపిన ల్యాండర్.. పిక్స్ షేర్ చేసిన ఇస్రో
Samantha | 14 ఏళ్ల తర్వాత మళ్లీ అక్కడికి.. ఆ సినిమాని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయిన సామ్
Luna – 25 | లూనా-25 కూలిన గంటల వ్యవధిలోనే ఆసుపత్రి పాలైన రష్యన్ శాస్త్రవేత్త