న్యూఢిల్లీ : చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర కరోనా మహమ్మారి బారినపడ్డారు. అలాగే ఎన్నికల కమిషనర్ రాజీవ్కుమార్ సైతం వైరస్కు పాజిటివ్గా పరీక్షలు చేశారు. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ అధికార ప్రతినిధి మంగళవారం తెలిపారు. ప్రస్తుతం వీరిద్దరూ వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నట్లు పేర్కొన్నారు. వారం రోజుల కిందట సుశీల్ చంద్ర సీఈసీగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. గత సోమవారం సునీల్ అరోరా పదవీ విరమణ చేయడంతో.. ఆయన 24వ ముఖ్య ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. ముగ్గురు సభ్యులుండే కేంద్ర ఎన్నికల సంఘంలో సునీల్ అరోరా పదవీ విరమణతో సుశీల్ చంద్ర, రాజీవ్ కుమార్ ఇద్దరే ఉన్నారు.
లోక్సభ ఎన్నికలకు ముందే 2019 ఫిబ్రవరి 14న సుశీల్ చంద్ర ఎన్నికల కమిషనర్గా నియామకమయ్యారు. మే 14, 2022 వరకు పదవిలో కొనసాగనున్నారు. ఆయన ఆధ్వర్యంలో ఎన్నికల సంఘం గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్, పంజాబ్, ఉత్తర ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్, పంజాబ్ అసెంబ్లీల పదవీకాలం వచ్చే ఏడాది మార్చిలో ముగియనుంది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ పదవీకాలం వచ్చే ఏడాది మే 14న ముగియనుంది. సుశీల్ చంద్ర భారత రెవెన్యూ సర్వీస్కు చెందిన 1980 బ్యాచ్కు చెందిన అధికారి.