న్యూఢిల్లీ : కాంగ్రెస్ను ఆర్ధికంగా దెబ్బతీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ ఆరోపించారు. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ ఖాతాలపై నరేంద్ర మోదీ ప్రభుత్వ దాడి కాదని భారత ప్రజాస్వామ్యంపై దాడని ఆయన అభివర్ణించారు. తాము రానున్న లోక్సభ ఎన్నికల ప్రచారం చేసుకోవాల్సి ఉండగా, ఇప్పుడు తమ ఖాతాలను నిలిపివేశారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఎన్నికల తేదీలు ప్రకటించినా తాము బ్యాంకులో ఉన్న రూ. 285 కోట్లను వినియోగించుకోలేక పోతున్నామని అన్నారు. ప్రచారం కోసం తాము వార్తాపత్రికల్లో, టీవీ ఛానెళ్లలో ప్రకటనల స్లాట్స్ను బుక్ చేసుకోవాలని, పోస్టర్లు ముద్రించాల్సి ఉందని చెప్పుకొచ్చారు. తాము ఈ పనులు చేసుకోలేకుంటే ఇక ప్రజాస్వామ్య మనుగడ ఎక్కడ ఉందని ఆయన ప్రశ్నించారు.
ఏడేండ్ల నాటి కేసులో పార్టీకి నోటీసులు జారీ చేశారని అన్నారు. 2017-18 నాటి కేసుకు సంబంధించి ఆదాయ పన్ను శాఖ ఇప్పుడు తమ పార్టీ బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసిందని అన్నారు. సీతారాం కేసరి హయాంలో 1994-95 అసెస్మెంట్ నోటీస్ ఇప్పడు తమకు జారీ చేశారని తెలిపారు. దీనికి సంబంధించి ప్రభుత్వం భవిష్యత్లోనూ తమను వేధిస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
Read More :