సిద్దిపేట, ఆగస్టు 3(నమస్తే తెలంగాణ ప్రతినిధి): సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం అకెనపల్లి పెద్దవాగు నుంచి ఇసుక అక్రమ రవాణా చేయడానికి ఒక్కో ట్రాక్టర్ యజమాని వద్ద నుంచి రూ. 20వేల చొప్పున జమచేసి పెద్ద మొత్తంలో స్థానిక రెవెన్యూ, పోలీస్ అధికారులకు ముట్టజెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో అధికారులు ఇసుక అక్రమ రవాణాకు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పగలు, రాత్రీ అనే తేడాలేకుండా ఇసుకను తోడేస్తున్నారు.
సమీప గ్రామాల్లో, వ్యవసాయ క్షేత్రాల్లో భారీగా ఇసుక డంపులు ఏర్పాటుచేశారు. ఇవన్నీ నంగునూరు రెవెన్యూ అధికారుల కనుసన్నల్లోనే జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం వెంటనే ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించి, ఇసుక అక్రమ తవ్వకాలు, అధికారుల సహకారంపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే అకెనపల్లి పెద్దవాగు పూర్తిగా ఇసుక మాఫియా బారిన పడే ప్రమాదం ఉందని వాగు పరీవాహక ప్రాంత రైతులు హెచ్చరిస్తున్నారు.
ఇందిరమ్మ ఇండ్ల పేరిట అనుమతులు తీసుకుని యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణ చేస్తున్నారు. ఈ ఇసుక తరలించే ట్రాక్లర్లకు నెంబర్ ప్లేట్లు సరిగా ఉండవు, డ్రైవర్లకు లైసెన్స్లు ఉండవు. ఇష్టారీతిగా అక్రమ రవాణాకు రెవెన్యూ, పోలీసు యంత్రాంగం నుంచి పూర్తి సహకారం లభిస్తోందని గ్రామస్తులు, రైతులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు.

దీంతో నిత్యం పదుల సంఖ్యలో ట్రాక్టర్లు వాగులోంచి ఇసుకను తరలిస్తున్నాయి. రాత్రివేళల్లో ఈ రవాణా మరింత జోరుగా సాగుతోంది. ఇటీవల జరిగిన డీడీఆర్సీ సమావేశంలో ఈ అంశాన్ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ దృష్టికి తీసుకెళ్లారు. అయినా అధికారుల్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. కలెక్టర్కు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. ఇంత జరుగుతున్నా ఎవరూ స్పందించకపోవడం వెనుక కారణాలేమిటన్న ప్రశ్న వాగు పరీవాహక ప్రాంత రైతుల్లో వ్యక్తమవుతున్నది.
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం అకెనపల్లి పెద్దవాగులో ఇసుక దోపిడీకి అడ్డుకట్ట పడడం లేదు. ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నా, రైతుల ఆందోళనలు చేస్తున్నా, ప్రజాప్రతినిధుల అధికారిక సమావేశాల్లో లేవనెత్తుతున్నా, ఇసుక అక్రమ రవాణాపై చర్యలు కరువయ్యాయి. ట్రాక్టర్ యజమానుల నుంచి ముడుపులు తీసుకుని అధికార యంత్రాం గం చర్యలు తీసుకోవడం లేదని వాగు పరీవాహక రైతులు ఆరోపిస్తున్నారు. రెవెన్యూ, పోలీస్ శాఖల పనితీరుపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.
పెద్దవాగులో విచ్చలవిడిగా ఇసుక తవ్వేయడంతో చుట్టుపక్కల భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లోని బోర్లలో నీటిమట్టం తగ్గిందని, ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో పడే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇసుక లోడ్తో ట్రాక్టర్లు గ్రామాల మీదుగా వెళ్తుండడంతో రోడ్లు పాడవుతున్నాయి. ఇసుక అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాల్సిన రెవెన్యూ, గనులు, పోలీసు శాఖలు పరస్పరం బాధ్యతలు తప్పించుకుంటున్నాయనే విమర్శలు ఉన్నాయి. అప్పుడప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించినా, వాస్తవానికి అక్రమ రవాణా మాత్రం తగ్గడం లేదని స్థానికులు చెబుతున్నారు.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు, ప్రభుత్వ పనుల కోసం వాగులో నుంచి ఇసుకను తీసుకెళ్లేందుకు రెవెన్యూ అధికారులు అడ్డగోలుగా అనుమతులు ఇస్తున్నారు. ఇదే అదునుగా భావించిన ఇసుక వ్యాపారులు, అనుమతుల మాటున అక్రమ ఇసుక దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఒక్క ట్రాక్టర్ ఇసుకకు అనుమతి పొంది, పది ట్రాక్టర్లకు పైగా ఇసుకను తరలిస్తున్నారు. అనుమతులపై పర్యవేక్షణ లేక ఇసుక అక్రమ దందా జోరుగా సాగుతున్నదని గ్రామస్తులు మండిపడుతున్నారు. తహసీల్దార్ నుంచి మొదలుకొని కలెక్టర్ వరకు రైతులు వినతి పత్రాలు ఇచ్చినా చర్యలు శూన్యం అని రైతులు వాపోతున్నారు. ఓ దశలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వాహనాలను పట్టుకొని పోలీసులకు అప్పజెప్పారు. అయినప్పటికీ ఇసుక దందా ఆగడం లేదు.