హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): ‘స్టోరేజీ సామర్థ్యం లేదు. ప్రస్తుతం ఉన్న బియ్యం నిల్వలు ఖాళీ అయితే తప్ప కొత్త బియ్యం తీసుకొనేందుకు అవకాశం లేదు..’ ఇదీ కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) తీసుకొనేందుకు భారత ఆహార సంస్థ(ఎఫ్సీఐ) చెప్తున్న సాకు. ఈ యాసంగి సీజన్కు సంబంధించిన సీఎంఆర్ తీసుకోవటంలో ఎఫ్సీఐ తిరకాసు పెడుతున్నదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మిల్లుల నుంచి ఎఫ్సీఐ గోదాముల ముందుకొచ్చిన బియ్యం లారీలను లోపలికి అనుమతించటం లేదు. స్టోరేజీ కెపాసిటీ(గోదాముల సామర్థ్యం) లేదంటూ బియ్యాన్ని దించుకొనేందుకు నిరాకరిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఎఫ్సీఐ గోదాముల ముందు బియ్యం లారీలు బారులు తీరాయి. కొన్ని ప్రాంతాల్లో వారం రోజులుగా లారీలు రోడ్లపైనే నిలిచిపోయాయి. రాష్ట్రంలో సుమారు 23 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల స్టోరేజీ కెపాసిటీ ఉన్నదని ప్రకటించిన ఎఫ్సీఐ.. ఇప్పుడు స్టోరేజీ లేదని చెప్పటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదీకాక.. సెప్టెంబర్ 30 వరకు సీఎంఆర్ను అప్పగించాలని గడువు విధించిన ఎఫ్సీఐ ఇప్పుడు ధాన్యం తీసుకోవటానికి సహకరించటం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ యాసంగిలో గతంలో ఎప్పుడూ లేనివిధంగా 92.35 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొన్నది. ఇందులో ఎఫ్సీఐకి 62.79 లక్షల టన్నుల సీఎంఆర్ను అందించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు 6లక్షల టన్నుల సీఎంఆర్ను అందించింది.
ఇంకా 57 లక్షల టన్నుల సీఎంఆర్ అందించాలి. గడువు చూస్తే రెండు నెలలే మిగిలి ఉన్నది. ప్రతిరోజూ వీలైనంత ఎక్కువ సీఎంఆర్ను డెలివరీ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే ఎఫ్సీఐ మాత్రం ఇందుకు సహకరించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాము ధాన్యాన్ని ఇస్తామన్నా తీసుకోవటం లేదని మిల్లర్లు చెప్తున్నారు. సీఎంఆర్ను తీసుకోవటంలో ఎఫ్సీఐ చేస్తున్న జాప్యంతో మిల్లర్లు, పౌరసరఫరాల సంస్థకు ఆర్థికంగా నష్టం వాటిల్లుతున్నది. సీఎంఆర్ అందించే క్రమాన్ని బట్టి ఎఫ్సీఐ.. పౌరసరఫరాల సంస్థకు నిధులు విడుదల చేస్తుంది. ఆ నిధులతో ఇప్పటికే ధాన్యం కొనుగోలు కోసం బ్యాంకుల నుంచి తీసుకొచ్చిన అప్పులను సంస్థ తీర్చుతుంది. లేదంటే అడ్డగోలుగా వడ్డీ భారం పడే అవకాశం ఉన్నది. ఇదిలా ఉంటే సీఎంఆర్ లోడ్తో వెళ్లిన లారీలు రోజుల తరబడి నిలిచిపోవటంతో మిల్లర్లపైనా రవాణా ఖర్చుల భారం పడుతున్నది. మిల్లుల్లోనూ మిల్లింగ్ నిలిచిపోతున్నది.
అన్ని రాష్ర్టాల మాదిరి కాకుండా అత్యధికంగా ధాన్యం ఉత్పత్తి చేస్తున్న తెలంగాణను ఎఫ్సీఐ ప్రత్యేకంగా పరిగణించాలి. ఇక్కడ రికార్డుస్థాయిలో ధాన్యం దిగుబడి అవుతున్నందున సీఎంఆర్ తీసుకోవటంలో వేగం పెంచాలి. పలు కారణాలతో సీఎంఆర్ స్వీకరణను నిలుపుదల చేయటం సరికాదు. మిల్లర్లు సీఎంఆర్ ఇస్తామన్నా తీసుకోకపోవటం దారుణం. ఇప్పటికైనా ఎఫ్సీఐ అధికారులు పంథా మార్చుకొని తెలంగాణకు సహకరించాలి.
మారెడ్డి శ్రీనివాస్రెడ్డి, పౌరసరఫరాల సంస్థ చైర్మన్