లక్నో: హోలీ వేడుకల తర్వాత భార్యాభర్తలు (Couple dies) బాత్రూమ్లో మరణించారు. వారి అనుమానాస్పద మృతిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తర ప్రదేశ్లోని ఘజియాబాద్లో ఈ సంఘటన జరిగింది. మురాద్నగర్లోని అగ్రసేన్ విహార్ ఫేజ్ వన్ కాలనీకి చెందిన 40 ఏళ్ల దీపక్ గోయల్, 36 ఏళ్ల భార్య శిల్పి తమ పిల్లలతో కలిసి బుధవారం హోలీ (Holi) జరుపుకున్నారు. అనంతరం దుస్తులు, శరీరానికి అంటిన రంగులను శుభ్రం చేసుకునేందుకు భార్యాభర్తలు కలిసి బాత్రూమ్లోకి వెళ్లారు.
కాగా, బాత్రూమ్లోకి వెళ్లిన తల్లిదండ్రులు గంటకు పైగా బయటకు రాకపోవడాన్ని పిల్లలు గమనించారు. పొరుగు వారి సహాయంతో బాత్రూమ్ డోర్ పగులగొట్టి చూశారు. లోపల అచేతనంగా పడి ఉన్న వారిద్దరినీ వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆ దంపతులు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
మరోవైపు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్ట్మార్టం కోసం దంపతుల మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. గీజర్ నుంచి లీకైన గ్యాస్ వల్ల ఊపిరాడక ఆ దంపతులు చనిపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత భార్యాభర్తల మరణానికి కారణం ఏమిటన్నది తెలుస్తుందని అన్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.