బెంగళూర్ : త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్నాటకలో (Karnataka) కాషాయ పార్టీకి గురువారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ పుట్టన్న ఆ పార్టీకి రాజీనామా చేశారు. పుట్టన్న త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీకి ఓటమి తప్పదని భావించిన పుట్టన్న గత కొద్దినెలలుగా బీజేపీకి దూరంగా ఉంటున్నారు.
కాంగ్రెస్లో చేరి రాజాజినగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో నిలవాలని ఆయన యోచిస్తున్నారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్గానూ వ్యవహరించిన పుట్టన్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిత్వాన్ని కోరుతున్నారు. రాజాజీనగర్ నుంచి ప్రస్తుతం బీజేపీ సీనియర్ నేత ఎస్. సురేష్కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా రాజాజీనగర్లో సురేష్కుమార్ను ఢీకొనేందుకు పుట్టన్న సన్నద్ధమవుతున్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీనియర్ నేత, ఎమ్మెల్సీ పుట్టన్న కాషాయ పార్టీని వీడటం ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బగా పరిశీలకులు భావిస్తున్నారు.
Read More