Aditya-L1 | చంద్రయాన్-3 (Chandrayaan-3) ఇచ్చిన ఊపుతో భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో (ISRO) మరో ప్రయోగం చేపట్టిన విషయం తెలిసిందే. సూర్యుని గుట్టు విప్పేందుకు ఆదిత్య ఎల్-1 (Aditya-L1) ప్రయోగాన్ని చేపట్టింది. ఈ మేరకు శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ-సీ57 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. శనివారం ఉదయం 11.50 నిమిషాలకు ఆదిత్య ఎల్1 స్పేస్క్రాఫ్ట్తో రాకెట్ విజయవంతంగా నింగిలోకి వెళ్లింది.
దీంతో ఇస్రో శాస్త్రవేత్తలపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu), ప్రధాని మోదీ (Pm Modi) సహా పలువురు ఇస్రో శాస్త్రవేత్తల కృషిని కొనియాడుతున్నారు. ‘భారతదేశపు మొట్టమొదటి సౌర మిషన్ అయిన ఆదిత్య-ఎల్1 ప్రయోగం భారతదేశ స్వదేశీ అంతరిక్ష కార్యక్రమాన్ని కొత్త పథంలోకి తీసుకెళ్లే ఒక మైలురాయి సాధన. ఇది అంతరిక్షం, ఖగోళ దృగ్విషయాలను బాగా అర్థం చేసుకోవడానికి మనకు ఎంతగానో సాయపడుతుంది. శాస్త్రవేత్తలు, ఇంజినీర్లను నేను అభినందిస్తున్నాను. మిషన్ విజయవంతం అయినందుకు నా శుభాకాంక్షలు’ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు.
‘చంద్రయాన్-3 విజయం తర్వాత, భారత్ తన అంతరిక్ష యాత్రను కొనసాగిస్తోంది. భారతదేశపు మొట్టమొదటి సోలార్ మిషన్ ఆదిత్య -L1ని విజయవంతంగా ప్రారంభించినందుకు ఇస్రోలోని శాస్త్రవేత్తలు, ఇంజినీర్లకు అభినందనలు. మొత్తం మానవాళి సంక్షేమం కోసం విశ్వంపై మంచి అవగాహనను పెంపొందించడానికి మన అవిశ్రాంతమైన శాస్త్రీయ ప్రయత్నాలు కొనసాగుతాయి’ అని ప్రధాని మోదీ అన్నారు.
Also Read..
Nitish Kumar | ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ముందస్తు లోక్సభ ఎన్నికలకు నాంది: నితీశ్ కుమార్
Elon Musk | నా కుమార్తెతో విభేదాలు నన్నెంతో బాధించాయి : ఎలాన్ మస్క్
Himachal Pradesh | రెండు నెలల్లో వర్షం కారణంగా 400 మంది మృతి : హిమాచల్ మంత్రి