Nitish Kumar | లోక్సభ ఎన్నికలు (Lok Sabha Polls) సమీపిస్తున్న తరుణంలో దేశంలో రాజకీయ పరిస్థితులు ఆసక్తికరంగా మారాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నిర్ణయాలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. ఈ నెల 18 నుంచి 22 వరకు ఐదురోజులపాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు (Parliament Special Session) నిర్వహించనున్నట్లు కేంద్రం ఇటీవలే అనూహ్య ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీనిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. జమిలి ఎన్నికలకు మార్గం సుగమం చేసే కీలక నిర్ణయం ఈ సమావేశాల్లోనే అమల్లోకి రావొచ్చునన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ప్రకటనతో బీజేపీ ముందస్తు లోక్సభ ఎన్నికలకు వెళ్లే ఆలోచన చేస్తున్నదనే ప్రచారం కూడా జరుగుతోంది.
ఈ నేపథ్యంలో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని భావిస్తోందని అన్నారు. అందుకు ఐదురోజులపాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడమే సంకేతమని వ్యాఖ్యానించారు. ‘ముందస్తు ఎన్నికల గురించి వారు (బీజేపీ పెద్దలు) ఆలోచిస్తున్నారనడానికి ఈ ప్రత్యేక సమావేశాలే సంకేతం అని మీరు (మీడియా) అర్థం చేసుకోవాలి. కొంతకాలంగా నేను ఇదే మాట్లాడుతున్నాను’ అని మీడియా సమావేశంలో నితీశ్ కుమార్ అన్నారు. కాగా, పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ఈ నెల 18 నుంచి 22 వరకు ఐదు రోజులపాటు నిర్వహించనున్నట్లు ప్రకటించిన కేంద్రం.. ఈ సమావేశాల ఎజెండా ఏమిటన్నది మాత్రం కేంద్రం బహిర్గతం చేయలేదు.
ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ప్రకటనతో బీజేపీ ముందస్తు లోక్సభ ఎన్నికలకు వెళ్లే ఆలోచన చేస్తున్నదనే ప్రచారం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో శుక్రవారం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ‘ఒకే దేశం-ఒకే ఎన్నికలు (One Nation One Election)’తో ఒకేసారి లోక్సభ, రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై కమిటీ అధ్యయనం చేస్తుందని ప్రభుత్వం తెలిపింది. జమిలి ఎన్నికల అంశంపై నిపుణులతోపాటు రాజకీయ పార్టీల నేతలతో కమిటీ సమావేశం కానున్నదని, వారి అభిప్రాయాలు తీసుకొంటారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. కమిటీ సభ్యుల పేర్లను త్వరలో ఓ నోటిఫికేషన్ ద్వారా వెల్లడించనున్నట్టు తెలుస్తున్నది. ఈ నెల 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలని కేంద్రం నిర్ణయం తీసుకొన్న తర్వాతి రోజునే జమిలి ఎన్నికలపై కమిటీ ఏర్పాటు ప్రాధాన్యం సంతరించుకొన్నది. అయితే పార్లమెంట్ సమావేశాల అజెండాపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. ఇంత అత్యవసరంగా సమావేశాలు నిర్వహిస్తున్న కేంద్రం, అందుకు కారణంగానీ, సమావేశాల ఎజెండాగానీ వెల్లడించకపోవటంతో ఊహాగానాలు మొదలయ్యాయి. లోక్సభను రద్దుచేసి బీజేపీ ముందస్తు ఎన్నికలకు వెళ్లబోతున్నదని జోరుగా ప్రచారం సాగుతున్నది.
ఒకవేళ మోదీసర్కారు జమిలి ఎన్నికలకు సిద్ధపడితే.. సార్వత్రిక ఎన్నికలతోపాటే రాష్ర్టాల శాసనసభ ఎన్నికలనూ నిర్వహించాల్సి ఉంటుంది. అదే జరిగితే, మొన్ననే ఎన్నికలు జరిగిన కర్ణాటకలో ఏం చేస్తారు? తెలంగాణలో ఎన్నికలను ఏప్రిల్కు మారుస్తారా? లేక కేంద్రమే ముందస్తుగా డిసెంబర్లో ఎన్నికలకు వచ్చేస్తుందా? ఇందుకు అవసరమైన రాజ్యాంగ సవరణలు ఆగమేఘాలపై సాధ్యమేనా? మోదీ సర్కారు ఇప్పుడే జమిలిని తెరమీదికి ఎందుకు తీసుకొస్తున్నది? వారు ప్రవచిస్తున్న ‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్’ ఆచరణ సాధ్యమేనా? జవాబులేని ప్రశ్నలెన్నో.. జనం కోరుతున్న స్పష్టత ఎంతో!
Also Read..
Elon Musk | నా కుమార్తెతో విభేదాలు నన్నెంతో బాధించాయి : ఎలాన్ మస్క్
La Tomatina | స్పెయిన్లో ఉత్సాహంగా టమాటా ఫెస్టివల్.. వీడియో
Himachal Pradesh | రెండు నెలల్లో వర్షం కారణంగా 400 మంది మృతి : హిమాచల్ మంత్రి