కోల్కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ శంఖారావాన్ని మోగించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. కాసేపట్లో అక్కడి బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో మోదీ మాట్లాడనున్నారు. ఇప్పటికే బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి వేదికపై ఉండటంపై విశేషం. మోదీ సమక్షంలో ఆయన బీజేపీలో చేరనున్నారు. ఈ సభకు ముందే బీజేపీ రాష్ట్ర ఇన్చార్జ్ కైలాష్ విజయవర్గియా శనివారం మిథున్ ఇంటికి వెళ్లారు. ఆయన ర్యాలీకి వస్తున్నారని కైలాష్ ముందుగానే వెల్లడించారు. మిథున్తోపాటు బెంగాల్కు చెందిన ఎంతోమంది జానపద కళాకారులు కూడా మోదీ ర్యాలీలో పాల్గొననున్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. 72 అడుగుల పొడవున్న ప్రధాన స్టేజీతోపాటు మరో రెండు స్టేజీలను వీళ్ల కోసం ఏర్పాటు చేశారు. ఒక స్టేజీపై టాలీవుడ్ (బెంగాలీ సినిమా) నటులు, మరో వేదిక ఇతర ప్రముఖులు కూర్చోనున్నారు.