లక్నో: రోడ్డు పక్కన నిలిచి ఉన్న లారీని పికప్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు పిల్లలతో సహా 8 మంది మరణించారు. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నారు. మరో 27 మంది గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నది. (UP Accident) ఉత్తరప్రదేశ్లోని కౌశాంబి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఒక గ్రామానికి చెందిన పలు కుటుంబాలు ప్రయాగ్రాజ్లో జరిగిన తలనీలాల సమర్పణ కార్యక్రమానికి హాజరయ్యారు. పికప్ వాహనంలో వారు తిరుగు ప్రయాణమయ్యారు.
కాగా, శుక్రవారం కౌశాంబి జాతీయ రహదారిలోని దోర్మా గ్రామం సమీపంలో వేగంగా వెళ్తున్న పికప్ వ్యాన్ రోడ్డు పక్కన నిలిచి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మహిళలు, ముగ్గురు పిల్లలు మరణించారు. మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు.
మరోవైపు ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలో ఉన్న పలు ఆసుపత్రులకు తరలించారు.
అయితే గాయపడి చికిత్స పొందుతున్న వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నదని పోలీస్ అధికారి తెలిపారు. పికప్ వాహనం డ్రైవర్ నిద్ర మత్తులో జోగడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Claims As Godman, Man Raps Woman | శివుడి అవతారమని నమ్మించిన వ్యక్తి.. మహిళపై అత్యాచారం