లక్నో: ఉత్తరప్రదేశ్లోని సంభాల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టైరు పేలిపోవడంతో రెండు బస్సులు ఢీకొన్నాయి. దీంతో ఏడుగురు మరణించగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ఈ ప్రమాదం సోమవారం తెల్లవారుజామున జరిగిందని సంభాల్ ఎస్పీ ఛక్రేశ్ మిశ్రా చెప్పారు. ఓ ప్రైవేటు బస్సు టైరు పేలడంతో అదుపుతప్పి మరో బస్సును ఢీకొట్టిందన్నారు. బాధితులంతా సంభాల్ జిల్లా ఛాప్రాకు చెందినవారని వెల్లడించారు. పెండ్లి వేడుక ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు.
ఈ ప్రమాద ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. సీనియర్ అధికారులు స్వయంగా పరిస్థితిని సమీక్షించాలని గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని ఆదేశించారు.