Criminal Cases | దేశవ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేల్లో (MLAs) 45 శాతం మందిపై క్రిమినల్ కేసులు (Criminal Cases) ఉన్నట్లు తేలింది. వారిలో 29 శాతం మంది హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, మహిళలపై నేరాలు వంటి తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నట్లు ఓ నివేదిక వెల్లడించింది.
ఎన్నికల సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్ ఆధారంగా 28 రాష్ట్రాలు/యూటీ అసెంబ్లీలకు చెందిన మొత్తం 4,123 మంది ఎమ్మెల్యేల్లో 4,092 మంది క్రిమినల్ రిపోర్ట్ను అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వెలికితీసింది. ఈ రిపోర్ట్ ప్రకారం.. మొత్తం ఎమ్మెల్యేల్లో దాదాపు 45 శాతం అంటే 1,861 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వారిలో 1,205 మంది (25 శాతం) హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, మహిళలపై నేరాలు వంటి తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నారు.
ఏపీకి చెందిన (Andhra Pradesh) ఎమ్మెల్యేలు అత్యధిక శాతం (174 మందిలో 138 మంది) క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నట్లు తేలింది. ఆ తర్వాత కేరళ, తెలంగాణలలో 69 శాతం, బీహార్ రాష్ట్రం 66 శాతం, మహారాష్ట్రలో 65 శాతం, తమిళనాడులో 59 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. తీవ్రమైన క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల జాబితాలో ఏపీ 59 శాతంతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత 50 శాతంతో తెలంగాణ, 49 శాతంతో బీహార్ ఉన్నాయి.
పార్టీల వారీగా విశ్లేషిస్తే.. ఏపీలోని చంద్రబాబు నాయుడుకు చెందిన తెలుగుదేశం పార్టీలో అత్యధికంగా 86 శాతం (134 మందిలో 115 మంది శాసనభ్యులు) మంది ఎమ్మెల్యేలు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. అంతేకాదు, టీడీపీకి చెందిన 61 శాతం (82 మంది ఎమ్మెల్యేలు) మంది ఎమ్మెల్యేలు తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దేశంలో బీజేపీకి చెందిన ఎమ్మెల్యేల్లో దాదాపు 39 శాతం అంటే 1,653 మంది శాసనసభ్యుల్లో 638 మంది క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో ప్రకటించారు. వారిలో 436 మంది అంటే 26 శాతం మంది తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇక 646 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో (52%) 339 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. 194 మందిపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయని సదరు నివేదిక వెల్లడించింది.
తమిళనాడు అధికార డీఎంకేలో 74 శాతం (132 మందిలో 98) మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీరిలో 42 మంది తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని తృణమూల్ కాంగ్రెస్కు చెందిన ఎమ్మెల్యేల్లో దాదాపు 41 శాతం అంటే 230 మందిలో 95 మంది క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. వారిలో 78 మంది (34%) తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఇక మొత్తంగా 54 మంది ఎమ్మెల్యేలు హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్నారని, 226 మందిపై హత్యాయత్నం కేసులు ఉన్నాయని నివేదిక పేర్కొంది. అంతేకాదు 127 మంది ఎమ్మెల్యేలు మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులను ఎదుర్కొంటున్నారు. వీరిలో 13 మంది అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. నేరారోపణలే కాదు ఎమ్మెల్యేల ఆర్థిక నేపథ్యాన్ని కూడా నివేదిక వెల్లడించింది. 119 మంది ఎమ్మెల్యేలు (3శాతం) బిలియనీర్లుగా పేర్కొంది. అన్ని రాష్ట్ర అసెంబ్లీల్లోని ఎమ్మెల్యేల ఆస్తులు రూ.17.92 కోట్లు అని… అయితే, క్రిమినల్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల ఆస్తులు రూ.20.97 కోట్లుగా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.
Also Read..
PM Modi | భారత్ శక్తిని ప్రపంచం మొత్తం చూసింది.. కుంభమేళా విజయంపై ప్రధాని మోదీ
Sidhu Moosewala | సిద్ధూ మూసేవాలా సోదరుడి ఫస్ట్ బర్త్డే వేడుకలు.. వీడియో షేర్ చేసిన మాజీ సీఎం
PM Modi | ట్రూత్ షోషల్లో చేరిన ప్రధాని మోదీ.. ట్రంప్తో ఉన్న పవర్ఫుల్ ఫొటోతో తొలి పోస్టు