Soumya Vishwanathan | జర్నలిస్ట్ సౌమ్యా విశ్వనాథన్ (Soumya Vishwanathan) హత్య కేసులో ఢిల్లీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో దోషులైన నలుగురికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చింది (4 Killers Sentenced To Life). మరో నిందితుడికి మూడేళ్లు జైలు శిక్ష ఖరారు చేసింది.
హెడ్లైన్స్ టుడే న్యూస్ ఛానెల్లో జర్నలిస్టుగా పనిచేసిన 25 ఏళ్ల సౌమ్యా విశ్వనాథన్ 2008 సెప్టెంబర్ 30న హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆఫీస్ ముగించుకొని కారులో ఇంటికి వెళ్తుండగా దుండగులు కాల్పులు జరిపి హత్య చేశారు. దక్షిణ ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలో కారులో ఆమె మరణించి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. తొలుత రోడ్డు ప్రమాదంగా భావించారు. ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత తలకు బెల్లెట్ గాయం వల్ల ఆమె చనిపోయినట్లు తెలిసింది. సీసీటీవీ ఫుటేజ్ కూడా దీనిని నిర్ధారించింది.
ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు రవి కపూర్, అమిత్ శుక్లాను అరెస్ట్ చేశారు. వారిని ప్రశ్నించగా నేరం అంగీకరించారు. సౌమ్యా విశ్వనాథన్ కాల్చి చంపి దోచుకున్నట్లు చెప్పారు. థ్రిల్లింగ్ కోసం ఈ హత్యలు చేసినట్టు వెల్లడించారు. ఈ నేపథ్యంలో మిగతా నిందితులైన బల్జీత్ మల్లిక్, అక్షయ్ కుమార్తో పాటు సహకరించిన అజయ్ సేథీని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. 2010 జూన్లో ఈ కేసుపై చార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో 15 ఏళ్ల పాటు విచారణ జరిపిన ఢిల్లీలోని సాకేత్ కోర్టు ఈ ఏడాది అక్టోబర్లో ఐదుగురు నిందితులు రవి కపూర్, అమిత్ శుక్లా, బల్జీత్ మల్లిక్, అక్షయ్ కుమార్, అజయ్ సేథీని దోషులుగా నిర్ధారించింది.
ఈ నేపథ్యంలోనే కేసును విచారించిన ఢిల్లీ కోర్టు ఐదుగురు నిందితుల్లో నలుగురు రవి కపూర్, అమిత్ శుక్లా, బల్జీత్ మల్లిక్, అక్షయ్ కుమార్కు తాజాగా జీవిత ఖైదు విధించింది. నలుగురు దోషుల చర్య ‘అరుదైన’ కేటగిరీ కిందికి రాదని, అందువల్ల వీరికి మరణశిక్ష విధించలేమని కోర్టు పేర్కొంది. హత్యకు సహకరించిన అజయ్ సేథీకి మాత్రం మూడేళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.
Also Read..
Sandwich | 7 డాలర్ల శాండ్విచ్ తిని పొరపాటున 7వేల డాలర్లు చెల్లించిన మహిళ.. చివరకు ఏమైందంటే
Mansoor Ali Khan | మన్సూర్ క్షమాపణలు చెప్పడంపై త్రిష రియాక్షన్ ఇదీ
Amitabh Bachchan | తన జుహూ బంగ్లాను కూతురికి గిఫ్ట్గా ఇచ్చేసిన అమితాబ్