Heavy Storm | భారీ వర్షాలు, ఆకస్మిక తుఫాను (Heavy Storm) కారణంగా అస్సాం (Assam) రాష్ట్రం అతలాకుతలమవుతోంది. తుఫాను కారణంగా ఆదివారం రాత్రి బ్రహ్మపుత్ర నదిలో పడవ బోల్తాపడింది (boat capsizes). ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మృతి చెందారు.
అస్సాంలోని సౌత్-సల్మారా మంకాచార్ జిల్లా గుండా కాళీ ఆల్గా ఘాట్ నుంచి నేపూర్ అల్గా చరంచల్ వరకు ప్రయాణికులతో వెళ్తున్న పడవ ఒక్కసారిగా బోల్తాపడింది. ఈ ఘటనలో మహిళ, ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. సమాచారం అందుకున్న అధికారులు స్థానిక మత్స్యకారుల సాయంతో సుమారు 20 మందిని రక్షించారు.
మరోవైపు భారీ వర్షం కారణంగా అస్సాం రాజధాని గువాహటిలోని (Guwahati) విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. లోకప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని పైకప్పులో కొంత భాగం కూలిపోయింది. పైనుంచి ఒక్కసారిగా సీలింగ్ పడిపోవడంతో ప్రయాణికులు భయబ్రాంతులకు గురయ్యారు. అక్కడి నుంచి పరుగులు పెట్టారు. బలమైన తుఫాను ఆ ప్రాంతాన్ని తాకడంతో టెర్మినల్ వెలుపల పైకప్పు ఒక భాగం ఎగిరిపోయిందని అధికారులు చెప్పారు. అయితే ఎవరికీ గాయాలు కాలేదని వెల్లడించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పలు విమానాలను దారిమళ్లించారు.
ఇదిలా ఉండగా.. రాష్ట్రానికి భారత వాతావరణ శాఖ (India Meteorological Department) వర్ష హెచ్చరికలు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకావం ఉందని అంచనా వేసింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈశాన్య అస్సాంలో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఏప్రిల్ 1 నుంచి 4వ తేదీ మధ్య తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అదేవిధంగా ఇవాళ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని గువాహటిలోని ఐఎండీ ప్రాంతీయ వాతావరణ కేంద్రం (RMC) అంచనా వేసింది.
Also Read..
Leopard | ఢిల్లీలో చిరుత కలకలం.. ఐదుగురిపై దాడి
Guwahati | కూలిన గువాహటి ఎయిర్పోర్ట్ పైకప్పు.. ప్రయాణికులకు తప్పిన ముప్పు
Libya PM | లిబియా ప్రధాని నివాసంపై గ్రనేడ్ దాడి