Amit Shah | న్యూఢిల్లీ, ఆగస్టు 11: బ్రిటిష్ కాలం నాటి ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ చట్టాల స్థానంలో కొత్త చట్టాలను తీసుకొస్తున్నట్టు కేంద్ర హోం మంత్రి అమిత్షా వెల్లడించారు. ఇందుకు సంబంధించిన బిల్లులను ఆయన శుక్రవారం లోక్సభలో ప్రవేశపెట్టారు. ఇండియన్ పీనల్ కోడ్(ఐపీసీ)-1860 స్థానంలో భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్)-2023, క్రిమినల్ ప్రొసీజర్ యాక్ట్(సీఆర్పీసీ)-1898 స్థానంలో భారతీయ నాగరిక్ సురక్ష సంహిత(బీఎన్ఎస్ఎస్)-2023, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్-1872 స్థానంలో భారతీయ సాక్ష్య(బీఎస్)-2023 బిల్లులను తీసుకొచ్చారు. ప్రజలకు సత్వర న్యాయం అందించడంతో పాటు ప్రజల ప్రస్తుత అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా న్యాయవ్యవస్థను మార్చేందుకు తాజా మార్పులకు శ్రీకారం చుట్టామని అమిత్షా అన్నారు. ఈ బిల్లులు ఆమోదం పొంది చట్టాలుగా మారితే, నేర న్యాయవ్యవస్థ పూర్తిగా మారిపోతుందని, ప్రతి ఒక్కరూ గరిష్ఠంగా మూడేండ్లలో న్యాయం పొందేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. కొత్త బిల్లుల ఉద్దేశం శిక్షించడం కాదని, బాధితులకు న్యాయం అందించడమని పేర్కొన్నారు. అయితే ఇదే సమయంలో నేరాలను ఆపేందుకు శిక్షలు కూడా ఉంటాయని అన్నారు.
బిల్లును తదుపరి పరిశీలన కోసం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి (హోం వ్యవహారాలు) పంపారు. ఏడు దశాబ్దాల భారత ప్రజాస్వామ్యంలోని అనుభవాలు.. సీఆర్పీసీతో పాటు క్రిమినల్ చట్టాలను సమగ్రంగా మార్చడానికి కారణమని ప్రభుత్వం పేర్కొన్నది.
హత్యలు, మహిళలపై లైంగిక దాడులకు సంబంధించి కొత్త నిబంధనలు చేర్చారు. హత్యానేరానికి మరణశిక్ష లేదా జీవిత ఖైదు పడుతుంది. లైంగిక దాడుల నిందితులకు కనీసంగా 10 ఏండ్లు లేదా జీవిత ఖైదు శిక్ష విధిస్తారు. అలాగే సామూహిక లైంగిక దాడుల కేసుల్లోని నిందితులకు కనీసంగా 20 ఏండ్లు శిక్ష ఉంటుంది లేదా జీవిత ఖైదు పడుతుంది. కొత్త బిల్లుల ప్రకారం.. లైంగిక దాడి తర్వాత బాధిత మహిళ మరణిస్తే లేదా అచేతన స్థితికి(కోమా లాంటి స్థితి) చేరితే, దోషికి 20 ఏండ్లు తగ్గకుండా కఠిన శిక్ష విధించొచ్చు. దాన్ని జీవిత ఖైదుకు పొడిగించడం లేదా మరణ శిక్ష కూడా వేయవచ్చు. 12 ఏండ్ల కంటే తక్కువ వయసున్న బాలికలపై లైంగిక దాడికి పాల్పడితే, ఆ నిందితుడికి 20 ఏండ్లు తక్కువ కాకుండా శిక్ష పడుతుంది. దీన్ని జీవిత ఖైదు లేదా మరణ శిక్ష వరకు పొడిగించవచ్చు.
మహిళలను మోసం చేసి, వారిని లైంగికంగా లోబరుచుకొనే ఘటనలకు సంబంధించి కూడా కీలక మార్పులు చేపట్టారు. కొత్త నిబంధనల ప్రకారం గుర్తింపును దాచి పెండ్లి చేసుకోవడం లేదా పెండ్లి, ఉద్యోగం, ప్రమోషన్ పేరుతో మహిళలపై లైంగిక దోపిడీకి పాల్పడడం నేరం కిందకు వస్తుంది. జరిమానాతో పాటు 10 ఏండ్ల వరకు శిక్ష ఉంటుంది.
శిక్ష పడిన నేరస్తులకు క్షమాభిక్ష విషయంలో కూడా పలు కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. క్షమాభిక్ష లేదా శిక్ష రద్దును ప్రభుత్వాలు తమ రాజకీయ అవసరాల కోసం వినియోగించుకోకుండా.. మరణశిక్షను కేవలం జీవిత ఖైదుగా మార్చుకోగలరని నిబంధన చేర్చారు. కొత్త మార్పు ప్రకారం జీవిత ఖైదు పడిన ఏడేండ్ల వ్యవధిలోపే ఆ నేరస్తుడికి క్షమాభిక్ష పెట్టే అవకాశం ఉంటుంది. ఇటీవల విడుదలైన బీహార్కు చెందిన క్రిమినల్-పొలిటీషియన్ ఆనంద్ మోహన్ అంశాన్ని అమిత్షా ప్రస్తావించారు.
ఐపీసీ, సీఆర్పీసీ, ఇండియన్ ఎవిడెన్స్ చట్టాల స్థానంలో కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన బిల్లులకు హిందీ పేర్లు పెట్టడంపై తమిళనాడు సీఎం, డీఎంకే చీఫ్ స్టాలిన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నంలో ఓ భాగమని విమర్శించారు. దీన్ని ‘భాషాపరమైన సామ్రాజ్యవాదం’గా స్టాలిన్ అభివర్ణించారు. హిందీ పేర్లు పెట్టే చర్యలను ప్రతిఘటిస్తామని పేర్కొన్నారు. హిందీ బలవంతంపై తమిళనాడులో చారిత్రక వ్యతిరేకత ఉన్నదని, ఈ బిల్లుల తర్వాత ప్రధాని మోదీకి ‘తమిళ్’ పదాన్ని ఉచ్చరించే హక్కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు బిల్లులు భారత వైవిధ్యాన్ని దెబ్బతీసే ప్రయత్నమని శుక్రవారం ఎక్స్(ట్విట్టర్) పోస్టులో పేర్కొన్నారు.
కేంద్రం తీసుకొచ్చిన బిల్లుల్లో ఏండ్లుగా చర్చనీయాంశంగా ఉన్న పలు ప్రధానఅంశాలున్నాయి. భారతీయ న్యాయ సంహిత బిల్లులో రాజద్రోహం(ఐపీసీ 124ఏ) రద్దు, మూకహత్యలు, మైనర్లపై లైంగిక దాడుల నేరాలకు మరణశిక్ష విధించేలా నిబంధనలు ఉన్నాయి. రాజద్రోహం చట్టాన్ని పూర్తిగా తొలగించనున్నారు. దీన్ని కొత్త రూపంలో తీసుకొస్తామని ప్రభుత్వం పేర్కొన్నది. దీని కింద దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడితే జీవిత ఖైదు విధించనున్నారు. ‘రాజద్రోహం’గా ఉన్న చట్టం కొత్తగా ‘దేశద్రోహం’గా మారుతుందని అధికారులు పేర్కొన్నారు. వేర్పాటువాదం, సాయుధ తిరుగుబాటు, విధ్వంసక కార్యకలాపాలు, దేశ సార్వభౌమాధికారం, సమగ్రతకు ముప్పు కలిగించే చర్యలకు గరిష్ఠంగా జీవిత ఖైదు విధింపు ఉంటుంది. మూక హత్యలు, మైనర్లపై లైంగిక దాడులకు పాల్పడితే మరణశిక్ష విధిస్తారు.
ఇండియన్ పీనల్ కోడ్(ఐపీసీ)-1860
క్రిమినల్ ప్రొసీజర్ యాక్ట్(సీఆర్పీసీ)-1898
ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్-1872
భారతీయ న్యాయ సంహిత-2023
భారతీయ నాగరిక్ సురక్ష సంహిత-2023
భారతీయ సాక్ష్య(బీఎస్)-2023
#WATCH | Union Home Minister Amit Shah says, "…Under this law, we are repealing laws like Sedition…," as he speaks on Bharatiya Nyaya Sanhita Bill, 2023; The Bharatiya Sakshya Bill, 2023 and The Bharatiya Nagrik Suraksha Sanhita Bill in Lok Sabha. pic.twitter.com/CHlz0VOf7Z
— ANI (@ANI) August 11, 2023