షాబాద్, మే 4 : హోం ఓటింగ్ ప్రక్రియను చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పకడ్బందీగా నిర్వహిస్తున్నామని రంగారెడ్డి జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ శశాంక తెలిపారు. శనివారం రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని హైదర్గూడ, అత్తాపూర్, వాసుదేవ్నగర్లలో సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు కలెక్టర్ శశాంక సమక్షంలో హోంఓటింగ్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనివారం ప్రారంభమైన ఈ ప్రక్రియ ఈనెల 6వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు.
మొదటి రోజున పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంటల్లో ఎన్నికల బృం దాలు ఆయా రూట్ల వారీగా తమకు నిర్దేశించిన ఓటర్ల ఇండ్లకు వెళ్లి వారి ఓటును సేకరించాయని చెప్పారు. బృందాల పనితీరును నిశితంగా పర్యవేక్షిస్తున్నామన్నారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లే అవసరం లేకుండా, ఇంటి నుంచే ఓటు వేసేలా ఎన్నికల సంఘం హోం ఓటింగ్ సదుపాయాన్ని తీసుకురావడం ద్వారా సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు ఎంతో వెసులుబాటు లభించిందన్నారు. ఓటర్ల ఇండ్ల వద్ద ఓటింగ్ కంపార్ట్మెంట్ను ఏర్పాటు చేసి, ఓటు గోప్యతకు భంగం వాటిల్లకుండా..వీడియోచిత్రీకరించి ఈసీ నిబంధలను అనుగుణంగా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు.
చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో 1,115 మంది ఓట్ ఫ్రమ్ హోం సదుపాయాన్ని వినియోగించుకోనుండగా, వారిలో 85 ఏండ్లకు పైబడిన సీనియర్ సిటిజన్లు 695మంది, దివ్యాంగ ఓటర్లు 420 మంది ఉన్నారని కలెక్టర్ తెలిపారు. మొత్తం 54 బృందాలు హోంఓటింగ్లో పాల్గొంటున్నాయని, ప్రతి బృందంలోనూ పీవో, వోపీవోతోపాటు మైక్రోఅబ్జర్వర్, వీడియోగ్రాఫర్, పోలీస్ సిబ్బంది ఉన్నారని తెలిపారు. హోం ఓటింగ్కు సంబంధించిన సమాచారాన్ని ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులతోపాటు పార్టీల ప్రతినిధులకు ముందస్తుగానే తెలియజేయడంతో పలుచోట్ల వారు కూడా పరిశీలిస్తున్నారని అన్నారు. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు తమకు నచ్చిన అభ్యర్థికి స్వేచ్ఛగా ఓటేయాలని సూచించారు. కలెక్టర్ వెంట రాజేంద్రనగర్ ఏఆర్వో వెంకట్రెడ్డి, హోం ఓటింగ్ టీం సభ్యులు, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.