Criminal Cases | దేశంలో ఐదు రాష్ట్రాలు తెలంగాణ, మధ్యప్రదేశ్, మిజోరాం, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ప్రజాప్రతినిధుల ఆస్తులు, ఇతర వివరాలను పలు సంస్థలు విడుదల చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఓ సంస్థ ఛత్తీస్గఢ్ (Chhattisgarh) ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల (Newly Elected MLAs) క్రిమినల్ కేసుల (Criminal Cases) చిట్టాను బయటపెట్టింది. దాంతోపాటు ఆదాయపు వివరాలను కూడా ప్రకటించింది.
ఛత్తీస్గఢ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. 90 స్థానాల్లో బీజేపీ 54, కాంగ్రెస్ 35 సీట్లు గెలుచుకుంది. అయితే ఆ రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో.. 17 మంది ఎమ్మెల్యేలు నేరచరిత్ర కలిగిన వారే. వారిలో ఆరుగురిపై నేరపూరిత బెదిరింపులు వంటి తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల వేళ ఇచ్చిన డిక్లరేషన్ ఆధారంగా ఈ విషయాన్ని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) నిర్ధారించింది.
బీజేపీకి చెందిన 22 శాతం మంది ఎమ్మెల్యేలు అంటే 12 మంది, కాంగ్రెస్కు చెందిన 14 శాతం అంటే ఐదుగురు ఎమ్మెల్యేలు తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు డిక్లరేషన్లో వెల్లడించారు. వీరిలో నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు, ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమపై తీవ్రమైన నేరారోపణలు ఉన్నట్లు డిక్లరేషన్లో పొందుపరిచారు. క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ భగల్ కూడా ఉన్నారు.
72 మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులే
ఇక 90 మందిలో 72 మంది కోటీశ్వరులే (Crorepatis) ఉన్నట్లు ఏడీఆర్ నిర్ధారించింది. బీజేపీ పార్టీకి చెందిన 43 మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరుల జాబితాలో ఉన్నారు. డిక్లరేషన్లో ఆ ఎమ్మెల్యేలు తమ ఆస్తులు కోటి కన్నా ఎక్కువగా ఉన్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 35 మంది ఎమ్మెల్యేల్లో 29 మంది కోటీశ్వరులు ఉన్నట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) పేర్కొంది.
ఈసారి ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల సగటు ఆస్తి 5.25 కోట్లుగా ఉంది. గత అసెంబ్లీలో ఆ సగటు 11.63 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ ఎమ్మెల్యే భవన్ బోరాకు అత్యధికంగా 33.86 కోట్ల ఆస్తి ఉంది. మాజీ సీఎం భూపేశ్ భగల్ ఆస్తి 33.38 కోట్లు. బీజేపీ ఎమ్మెల్యే అమర్ అగర్వాల్ 27 కోట్లతో మూడవ స్థానంలో ఉన్నారు.
Also Read..
Kim Jong Un | కన్నీళ్లు పెట్టుకున్న ఉత్తర కొరియా నియంత
Khushi Kapoor | ది ఆర్చీస్ స్క్రీనింగ్.. తల్లి శ్రీదేవి గౌనులో మెరిసిన ఖుషి కపూర్