దేశీయ స్టాక్ మార్కెట్లలో ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ల (ఐపీవోలు) మోత మోగుతున్నది. ఇప్పటికే చాలా సంస్థలు ఐపీవోకు రాగా, మరిన్ని కంపెనీలు క్యూ కడుతున్నాయి. రూ.55,000 కోట్ల సమీకరణకు 30 కంపెనీలు ఐపీవో పత్రాల్ని మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి సమర్పించగా, మరో 10-15 కంపెనీలు రూ.25,000 కోట్ల సేకరణకు సిద్ధమవుతున్నాయి.
ఈ ఏడాది మొత్తం రూ.80,000 కోట్ల విలువైన ఐపీవోలు జారీ అవుతాయని అంచనా. గతేడాది ఐపీవోల ద్వారా ఆయా కంపెనీలు రూ. 30,000 కోట్లకుపైగా నిధుల్ని సమీకరించాయి.
ఈ సంవత్సరంలో ఇప్పటివరకూ స్టార్టప్లు, కెమికల్ కంపెనీలు, రెస్టారెంట్ చైన్ల నుంచి కూడా ఐపీవోలొచ్చాయి.
కొవిడ్ సంక్షోభం కొనసాగుతున్నప్పటికీ ఈ ద్వితీయార్ధంలో కూడా ఇదే ట్రెండ్ కనబడుతున్నది. 2021లో ఐపీవోల కోసం కంపెనీలు ఎందుకు క్యూ కడుతున్నాయంటే…
జొమోటో రూ.9,375 కోట్ల ఐపీవో బుధవారం ప్రారంభమవుతున్నది. రూ.72-76 ధరల శ్రేణితో జారీ అయ్యే ఈ ఐపీవోతో జొమాటోకు రూ.64,365 కోట్ల విలువ ఏర్పడుతున్నది.
దేశంలో ఇప్పటి వరకూ వచ్చిన ఐపీవోలన్నింటినీ మించిన భారీ ఐపీవో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రానున్నది. తాజాగా కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర పొందిన ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూ రెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) రికార్డు స్థాయిలో నిధులు సమీకరిస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఒక్క ఐపీవోనే రూ.70,000 కోట్లకుపైగా నిధుల్ని మార్కెట్ నుంచి సమీకరించవచ్చని భావస్తున్నారు. ఇక డిజిటల్ పేమెంట్స్ సంస్థ పేటీఎం.. ఐపీవో ద్వారా రూ.17,000 కోట్లు సేకరించేందుకు ఇప్పటికే షేర్హోల్డర్ల అనుమతి పొందింది. ఈ సంవత్సరం ఐపీవోలకు సిద్ధమవుతున్న కంపెనీల జాబితా చాలా పెద్దదే. ఫ్లిప్కార్ట్, మొబిక్విక్, బజాజ్ ఎనర్జీ, కెమ్ప్లాస్ట్ సన్మార్, అరోహణ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, గ్లెన్మార్క్ లైఫ్ సైన్సెక్స్, ఉత్కర్ష్ స్మాల్ఫైనాన్స్ బ్యాంక్, పురానిక్ బిల్డర్స్, శ్రీరామ్ ప్రాపర్టీలు ఈ జాబితాలో ఉన్నాయి. మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరం ఐపీవోలపరంగా సరికొత్త రికార్డుల్నే సృష్టించగలదన్న అంచనాలు జోరుగా వినిపిస్తున్నాయి.
–నమస్తే తెలంగాణ బిజినెస్ డెస్క్