Drugs Seized | గుజరాత్ తీరంలో పాకిస్థాన్ బోటు నుంచి 86 కేజీల మాదక ద్రవ్యాలను భారతతీర రక్షక దళం స్వాధీనం చేసుకుంది. దాంతో పాటు ఓడలో ఉన్న 14 మందిని కూడా అరెస్టు చేసింది. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ రూ.600 కోట్లు ఉంటుందని అంచనా. కోస్ట్గార్డ్, గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB)తో కలిసి అరేబియా సముద్రంలో ఆపరేషన్ నిర్వహించారు. అయితే, పాకిస్థాన్ బోటు నుంచి డ్రగ్స్ ఎలా స్వాధీనం చేసుకున్నారనే విషయాన్ని కోస్ట్గార్డ్ ఇంకా వివరాలు వెల్లడించలేదు.
మారిటైమ్ సేఫ్టీ ఏజెన్సీ ప్రకారం.. ఆపరేషన్ రాత్రిపూట నిర్వహించింది. కోస్ట్గార్డ్ నౌకలు, విమానాలను ఆపరేషన్ కోసం వినియోగించారు. ఎన్సీబీ, ఏటీఎస్ అధికారులు ఐసీజీ షిప్ రాజ్రతన్లో అనుమానాస్పద బోటును గుర్తించారు. నిపుణుల బృందం పాక్ బోట్లోకి దిగి తనిఖీలు నిర్వహించింది. ఈ క్రమంలో దాదాపు 86 కిలోల డ్రగ్స్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 14 మంది సిబ్బందితో పాటు పాకిస్థానీ పడవను స్వాధీనం చేసుకున్నారు. విచారణ కోసం బోట్ను పోర్బంద్కు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.