యాసంగి సీజన్ రైతు బంధు సాయం కోసం రైతాంగం ఎదురు చూస్తున్నది. సీజన్ ఇప్పటికే ప్రారంభం కాగా కొత్త ప్రభుత్వం ఈ నెల 10 నుంచి పెట్టుబడి సాయం ఇవ్వడం షురూ చేసింది. కానీ.. అందరికీ డబ్బులు పడకపోవడంతో అన్నదాతలు నిరాశ చెందుతున్నారు. జిల్లాలో 5.42 లక్షల మంది రైతులకు రూ.624 కోట్ల పెట్టుబడి సాయం రావాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 1.14 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.26.94 కోట్లు మాత్రమే జమ అయ్యాయి. గత యాసంగిలో కేసీఆర్ ప్రభుత్వం తొలి రోజే 1.41 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.43 కోట్లు జమ చేయగా.. ఈ సారి పది రోజులైనా రూ.26కోట్లు మాత్రమే రైతుల అందాయి.
పంట పెట్టుబడి కోసం కేసీఆర్ ప్రభుత్వం ప్రతి సీజన్లో ఎకరానికి 5 వేల రూపాయలు రైతులందరి ఖాతాల్లో జమ చేసిన విషయం తెలిసిందే. ఈ యాసంగి సీజన్కు కూడా రైతు బంధు ఇచ్చే ప్రయత్నం చేయగా, కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో ఎన్నికల కమిషన్ నిలిపివేసింది. అయితే.. తాము అధికారంలోకి వస్తే ఎకరానికి రూ.7500 చొప్పున ఏడాదికి రూ.15వేలు ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు దాన్ని అమలు చేయడంలేదు. పాత పద్ధతిలోనే ఎకరానికి రూ.5వేలు ఇస్తున్నది.
ఈ నెల 3న కొలువుదీరిన కాంగ్రెస్ సర్కారు ఈ నెల 10నుంచి రైతు బంధు ఇస్తామని చెప్పి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడం ప్రారంభించింది. కానీ.. జిల్లా వ్యాప్తంగా 5,42,406 మంది రైతులకు రూ.624,14,84,629 పెట్టుబడి సాయం ఇవ్వాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 1,14,542 మంది రైతులకు రూ.26,94,65,516 మాత్రమే జమ చేసింది. ఒక గుంట జాగా నుంచి ప్రారంభం చేసి ఇప్పటి వరకు ఎకరం భూమి ఉన్న వారికి జమ చేసినట్లు తెలుస్తున్నది.
కేసీఆర్ ప్రభుత్వం గత యాసంగి సీజన్లో తొలి రోజే రూ.43కోట్లు రైతుల ఖాతాల్లో రైతు బంధు జమ చేయగా.. ఈ సారి పది రోజులైనా రూ.26కోట్లు మాత్రమే పడ్డాయి. అప్పుడు మొత్తం 1.41 లక్షల మందికి 86,531 ఎకరాలకు సంబంధించి రైతు బంధు ఇచ్చింది. ఇప్పుడు ఈ పది రోజుల్లో 1.14 లక్షల మందికి 52,500 ఎకరాలకు మాత్రమే పడ్డాయి. దాంతో గత యాసంగిలో బీఆర్ఎస్ ప్రభుత్వం జమ చేసిన రైతు బంధు కంటే ఈ సారి చాలా ఆలస్యంగా రైతుల ఖాతాల్లో జమ అవుతుండటంతో తమకు ఎప్పుడు వస్తాయోనని పెద్ద రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతుల ఖాతాల్లో రూ.26.94 కోట్లు జమ
యాసంగి సీజన్కు సంబంధించి రైతు బంధు డబ్బును ప్రభుత్వం ఈ నెల 10నుంచి రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నది. జిల్లాలో 5,42,106 మంది రైతులకు పెట్టుబడి సాయం రావాల్సి ఉండగా ఇప్పటి వరకు 1,14,542 మంది ఖాతాల్లో రూ.26,94,65,516 జమ అయ్యాయి. మిగిలిన రైతులకు కూడా వేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. గతంలో వేసిన విధంగానే ఈ సారి కూడా ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున జమ అవుతున్నాయి.
– శ్రవణ్కుమార్, నల్లగొండ డీఏఓ
నేను ఐదెకరాల్లో పొలం పెట్టా. విత్తనాల కోసం కావాల్సిన డబ్బులు బయట తీసుకొచ్చినప్పటికీ ఇంకా నాటు వేసిన కూలోల్లకు ఇవ్వలేదు. దాంతోపాటు ఎరువులకు కూడా డబ్బులు కావాలి. రైతు బంధు వస్తదంటే దాని కోసమే ఎదురు చూస్తున్న. ఎప్పుడు సెల్లుకు మెసేజీ వస్తదేమోనని చూస్తున్న. డబ్బులు పడగానే ఎరువులు తీసుకొని రావాలి.
– బైరగోని జానయ్య, రైతు, చిన్నాయిగూడెం, తిప్పర్తి మండలం