రఘునాథపాలెం, ఆగస్టు 13: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఏళ్లుగా గోప్యంగా సాగుతున్న రేట్ డిఫరెన్స్ (ఆర్డీ) వ్యవహారం రచ్చకెక్కింది. అధికారులు, వ్యాపారుల మధ్య ఆర్డీ వ్యవహారం తారస్థాయికి చేరింది. మార్కెట్లో జరుగుతున్న పలు పరిణామాల నేపథ్యంలో అధికారులు 15 రోజులుగా ఆర్డీని నిలిపివేయడంతో వ్యాపారులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఖమ్మం ఏఎంసీ వేదికగా కర్షకుల కష్టాన్ని దోచుకుంటూ రూ.కోట్లు గడిస్తున్న వ్యాపారులు.. ప్రభుత్వానికి చెల్లించే ఆదాయానికి గండికొడతామని బహిరంగంగానే తేల్చి చెబుతుండడం గమనార్హం.
చేసిన వ్యాపారంలో 50 శాతమే ప్రభుత్వానికి ఆదాయంగా చెల్లిస్తామని, మిగిలినది తమ ఆదాయంగా మార్చుకుంటామని వ్యాపారులు బాహాటంగానే చెబుతున్నారు. జీరో దందాకు సహకరించాల్సిందేనని తేల్చి చెబుతున్నారు. అయితే, ఈ ఆర్డీ వ్యవహారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో దశాబ్దాలుగా రహస్యంగా సాగుతున్నా.. అధికారుల మధ్య సమన్వయలోపం కారణంగా ఇటీవల బహిర్గతమైంది. ఈ క్రమంలో జీరో దందా, ఆర్డీకి ఫుల్స్టాప్ పడడంతో వ్యాపారులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్నో ఏళ్లుగా సీక్రెట్గా సాగుతున్న జీరో దందా ఎట్లాగూ బహిర్గతమైంది కాబట్టి ఇకపైనా ఓపెన్గానే జీరో దందాకు అవకాశం ఇవ్వాలనే డిమాండ్తో వ్యాపార వర్గాలు ఉన్నట్లు తెలుస్తోంది.
జీరో వ్యాపారానికి అవకాశం కల్పిస్తేనే మార్కెట్లో రైతుల పంటలను కొనుగోలు చేస్తామంటూ వ్యాపారులు మంగళవారం కొనుగోళ్లను బంద్ చేసిన విషయం విదితమే. జెండాపాట జరిగినప్పటికీ వ్యాపారులు ఆకస్మిక బంద్ పాటించి రైతులను ఇబ్బందులకు గురిచేశారు. దీంతో ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో జరుగుతున్న వ్యాపారుల రహస్యగుట్టు బహిర్గతమైంది. ఈ వ్యవహారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కలెక్టర్ దివాకర దృష్టికి వెళ్లింది. అయితే, బుధవారం సాయంత్రం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు.. ఏఎంసీ చైర్మన్ యరగర్ల హనుమంతరావుతో చర్చలు జరిపారు.
అయినప్పటికీ ఫలితం లేకపోయింది. జీరో దందా, ఆర్డీకి సహకరిస్తేనే వ్యాపారం చేస్తామని వ్యాపారులు భీష్మించుకొని కూర్చున్నట్లు తెలిసింది. దీంతో జోక్యం చేసుకున్న ఏఎంసీ చైర్మన్ హనుమంతరావు.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అందుబాటులో లేని కారణంగా కొంత అవకాశం ఇవ్వాలని కోరినట్లు సమాచారం. ఆగస్టు 15 తరువాత సమస్యను మంత్రి తుమ్మల దృష్టికి తీసుకెళ్తానని, ఆ తరువాత మరోమారు చర్చలకు కూర్చుందామని వారం రోజులు గడువు ప్రకటించినట్లు తెలిసింది. ఏది ఏమైనా జీరో వ్యాపారానికి అవకాశం ఇస్తేనే మార్కెట్లో కొనుగోళ్లు చేస్తామని, లేనిపక్షంలో కొనుగోళ్లు నిలిపివేస్తామని వ్యాపారులు స్పష్టంగా తేల్చిచెప్పినట్లు తెలిసింది.
కాగా, ఖమ్మంలో జీరో దందాకు ఫుల్స్టాప్ పడడంతో వ్యాపారుల చూపు తల్లాడ మార్కెట్ వైపు పడింది. ఇక్కడ కొనుగోళ్లను నిలిపివేసిన వ్యాపారులు తల్లాడ మార్కెట్కు పరుగులు తీస్తున్నారు. దీనిని గమనించిన మార్కెట్ అధికారులు తల్లాడలోనూ ఆర్డీని నిలిపివేసినట్లు తెలిసింది. వారం రోజుల వరకు జిల్లాలో ఎక్కడా ఆర్డీ వ్యవహారం ఉండొద్దనే ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
దీంతో జిల్లాలోని అన్ని మార్కెట్లలోనూ బుధ, గురువారాల్లో పంటల క్రయవిక్రయాలు నామమాత్రంగా సాగాయి. ఖమ్మంలో మంగళవారం జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకొని రైతులు తమ పంటను విక్రయించేందుకు ఆసక్తి చూపలేదు. వ్యాపారులు కూడా ముందుకు రాకపోవడంతో అధికారులు తూతూమంత్రంగా మార్కెట్ను నిర్వహించి ముగించారు. అయితే, జీరో దందాను బహిర్గతం చేసి ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు ఉన్న ఖ్యాతిని బజారుకీడ్చారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.