యాదగిరిగుట్ట, మే 9 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దివ్య క్షేత్రంలో స్వామివారి వెండి మొక్కు జోడు సేవోత్సవం అర్చకులు అత్యంత వైభవంగా జరిపారు. మంగళవారం సాయంత్రం స్వామివారిని గరుఢవాహనం, అమ్మవారిని తిరుచ్చి వాహనంపై వేంచేపు చేసి జోడు సేవను కొనసాగించారు. స్వయంభూ నారసింహుడికి నిత్యోత్సవాలను అర్చకులు తెల్లవారుజాము నుంచే ప్రారంభించారు. స్వామివారికి సుప్రభాత సేవ, తిరువారాధనలు, నిజాభిషేకం జరిపిన అర్చకులు తులసీ సహస్రనామార్చన శాస్ర్తోక్తంగా జరిపారు. సుదర్శన నారసింహ హోమం అత్యంత వైభవంగా సాగింది. ఆలయం వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ హోమం జరిపారు. స్వామి, అమ్మవార్లను గజ వాహనంపై వేంచేపు చేసి కల్యాణోత్సవ సేవను జరిపారు.
కల్యాణ మండపంలో స్వామి, అమ్మవార్లకు నిత్య తిరుకల్యాణోత్సవం అత్యంత వైభవంగా సాగింది. గంటన్నరపాటు సాగిన కల్యాణోత్సవంలో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ముఖ మండపంలో సువర్ణమూర్తులకు బంగారు పుష్పార్చనలు అత్యంత వైభవంగా జరిగాయి. ప్రత్యేకంగా బంగారంతో తయారు చేసిన 108 పుష్పాలను శ్రీవారి సన్నిధిలో ఉంచి వాటితో అర్చన చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు దఫాలుగా జరిగిన సువర్ణపుష్పార్చనలో భక్తులు పాల్గొని పూజలు నిర్వహించారు. సాయంత్రం దర్భార్సేవలో భాగంగా ప్రధానాలయ ముఖ మండపంలో స్వామి, అమ్మవార్లను దివ్య మనోహరంగా అలంకరించి వేంచేపు చేశారు. నాలుగు వేదాలు స్వామివారికి పారాయణం చేసి స్వస్తిమంత్రార్థ వంటి మంత్రాలతో శాంతింపజేశారు. అనంతరం స్వామివారిని గర్భాలయానికి వేంచేపు చేశారు. రాత్రి స్వామివారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన అత్యంత వైభవంగా సాగింది.
శయనోత్సవ సేవను అర్చకులు సంప్రదాయ రీతిలో జరిపారు. ప్రధానాలయం, క్యూ కాంప్లెక్స్, శివాలయంలో చెంతనగల క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి ఆకుపూజను ఘనంగా నిర్వహించారు. హనుమంతుడిని సింధూరంతో అలంకరించి అభిషేకించారు. తమలపాకులతో అర్చించి లలితాపారాయణం చేశారు. ఆంజనేయస్వామికి ఇష్టమైన వడపప్పు. బెల్లం, అరటి పండ్లను నైవేధ్యంగా సమర్పించారు. భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. సుమారు 14వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలను కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.26,51,734 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు. సమాచార హక్కు చట్టం మాజీ ప్రధాన కార్యదర్శి వర్రె వెంకటేశ్వర్లు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు.