యాదగిరిగుట్ట, ఫిబ్రవరి15 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్ల నిత్యోత్సవాలు వైభవంగా జరిగాయి. బుధవారం ఉదయం స్వామి, అమ్మవార్లకు సుదర్శన నారసింహ హోమంలో భాగంగా సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ హోమం జరిపారు. అనంతరం వెలుపలి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం జరిపారు. కల్యాణోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. తిరువారాధన నిర్వహించి ఉదయం ఆరగింపు చేపట్టారు.
స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన జరిపారు. సాయంత్రం వెండి మొక్కు జోడు సేవలు, దర్బార్ సేవలో భక్తులు పాల్గొని తరించారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటంకంగా సాగాయి. స్వామివారిని సుమారు 12 వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలు కలిపి స్వామివారి ఖజానాకు రూ.17,48,626 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఇన్చార్జి ఈఓ రామకృష్ణారావు తెలిపారు.
గుట్టలో మహాశివరాత్రి ఉత్సవాలకు శ్రీకారం..
యాదగిరిగుట్ట, ఫిబ్రవరి15 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా కొనసాగుతున్న పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామి ప్రధానాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలకు ఆలయ పూజారులు బుధవారం శ్రీకారం చుట్టారు. ఆరు రోజులపాటు జరిగే ఉత్సవాల్లో తొలిరోజు ప్రధానాలయ ముఖ మండపంలో ఉదయం 10.30 గంటలకు స్వస్తివాచనం నిర్వహించారు. లోకంలోని సర్వ విఘ్నాలు, దోషాలు తొలిగి ఈశ్వర అనుగ్రహం కలుగాలని, శైవాగమ సంప్రదాయ రీతిలో ఈ వేడుకను జరిపించారు. అనంతరం విఘ్నాధిపతి, సకల విఘ్న వినాశకుడైన విఘ్నేశ్వరుడిని సర్వకార్యాలు నిర్విఘ్నంగా పరిసమాప్తి జరిగేలా అనుగ్రహించమని పార్థిస్తూ విఘ్వేశ్వర ఆరాధన జరిపించారు. శుద్ధ, పవిత్రమైన జలంతో వేదమంత్ర పఠనంతో పూజ ద్రవ్యాలను ఆలయ పరిసరాల్లో ప్రోక్షణ గావించి శుద్ధి కార్యక్రమం చేపట్టారు. ఉత్సవాలు పరమేశ్వర అనుగ్రహంతో సక్రమంగా నిర్వహించబడాలని పూజాధికార్యాలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు భక్తులకు రక్షబంధనాలు ధరింపజేశారు.
నేడు దేవతాహ్వానం&
ఉత్సవాల్లో భాగంగా సాయంత్రం పారాయణికులచే నమక, చమక పారాయణాలు, మంత్రపుష్ప పఠనం, అంకురారోపణం, సోమకుంభ, కలశస్థాపన, దేవతారాధన వంటి పూజలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ గావించారు. గురువారం ధ్వజ పటారోహణం, భేరిపూజ, దేవతాహ్వానం, అగ్ని ప్రతిష్ఠ వంటి పూజలు జరుగనున్నాయి. వేడుకల్లో అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఇన్చార్జి ఈఓ రామకృష్ణారావు, డీఈఓ దోర్బాల భాస్కర్శర్మ, ఏఈఓ గజవెల్లి రమేశ్బాబు, ప్రధాన పురోహితులు సత్యనారాయణ శర్మ, శివాలయ ప్రధానార్చకులు నరసింహరాముల శర్మ, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.