– తెలంగాణ యోగా అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్.ఎన్.రెడ్డి
బీబీనగర్, ఆగస్టు 25 : యోగా ఆరోగ్యంతో పాటు ఏకాగ్రత, మానసిక ప్రశాంతత, క్రమశిక్షణను పెంపొందిస్తుందని తెలంగాణ యోగా అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్.ఎన్.రెడ్డి అన్నారు. మంగళవారం బీబీనగర్ మండలంలోని రాఘవాపూర్ గ్రామ పరిధిలోని రాక్వుడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో జిల్లా స్థాయి యోగా పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలలో జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యోగా విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో దోహద పడుతుందన్నారు. జిల్లా స్థాయి పోటీలకు రాక్ వుడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆతిథ్యం ఇవ్వడం అభినందనీయమన్నారు. విద్యార్థుల్లో యోగా పట్ల ఆసక్తిని పెంపొందించడంతో పాటు వారి ప్రతిభను ప్రోత్సహించడం సంతోషకరమని తెలిపారు. పోటీ అనంతరం విద్యార్దులకు బమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యోగా అసోసియేషన్ కార్యదర్శి సిద్ధారెడ్డి, ట్రస్మా వైస్ ప్రెసిడెంట్ జితేందర్ రెడ్డి, కరీంనగర్ జిల్లా కార్యదర్శి రామకృష్ణ, జాతీయ రిఫరీ ఆనంద్ పాల్గొన్నారు.