యాదాద్రి, జూలై 29 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి నిత్యోత్సవాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పారు. స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం చేశారు. స్వామి, అమ్మవార్లకు తిరువారాధన చేపట్టి ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శనభాగ్యం కల్పించారు.
ప్రధానాలయ ఉత్తరదిశ మొదటి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం, నిత్య తిరుకల్యాణోత్సవం జరిపించారు. స్వామివారి కల్యాణోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తరించారు. సాయంత్రం స్వామివారి వెండి మొక్కు జోడు సేవలు, దర్బార్ సేవ, తిరువారాధన ఘనంగా నిర్వహించారు. స్వయంభూ నారసింహుడికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టారు. సాయంత్రం ప్రధానాలయ అద్దాల మండపంలో ఊంజల్ సేవను కోలాహలంగా నిర్వహించారు. ప్రధానాయం వెలుపల ప్రాకారంలో గల అద్దాల మండపంలో ఆండాళ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పరమ పవిత్రంగా నిర్వహించే సేవలో మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వయంభూ నారసింహుడి ప్రధానాలయం వెలుపల ప్రాకారం అద్దాల మండపంలో ఊయలలో శయనింపు చేసి గంట పాటు వివిధ రకాల పాటలతో అమ్మవారిని కొనియాడుతూ లాలిపాటలు పాడారు. స్వామిని 10వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. శ్రీవారి ఖజానాకు శుక్రవారం రూ.9,69,362 ఆదాయం వచ్చినట్లు ఈఓ ఎన్.గీత తెలిపారు.
అమ్మవారికి బంగారు చీర
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ప్రధానాలయంలోని లక్ష్మీ అమ్మవారికి వనపర్తి జిల్లా అమరచింతలోని శుభాష్నగర్కు చెందిన భక్తురాలు మారెడ్డి ప్రమీత బంగారు చీర సమర్పించారు. ఈ మేరకు బంగారు చీరను అర్చకులు అమ్మవారికి శుక్రవారం అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు.
ఆలయ పనులు పరిశీలించిన క్వాలిటీ కంట్రోల్ బృందం
యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను ఆర్అండ్బీ విభాగం క్వాలిటీ కంట్రోల్ బృందం పరిశీలించింది. కొండపైన పూర్తికానున్న స్వాగత తోరణం, కొండకింద డ్రైనేజీ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పనుల్లో చేపట్టిన నాణ్యతా ప్రమాణాలు పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్అండ్బీ క్వాలిటీ కంట్రోల్ డిప్యూటీ ఈఈ రవీందర్, ఏఈ రమణ, ఆర్అండ్బీ ఏఈ శ్రీనివాస్ పాల్గొన్నారు.
విమానగోపురం స్వర్ణతాపడానికి రూ.10 లక్షల విరాళం
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్య విమానగోపురం స్వర్ణతాపడానికి దాతల నుంచి విరాళాలు వెల్లువలా వస్తున్నాయి. హైదరాబాద్లోని హబ్సీగూడకు చెందిన డాక్టర్ కేవీ.రమాకాంత్రావు రూ.10 లక్షల విరాళం సమర్పించారు. ఇందుకు సంబంధించిన చెక్కును యాదాద్రిలో ఆలయ ఈఓ ఎన్. గీతకు అందించారు.