యాదాద్రి, జూలై 2 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం నిత్యపూజల కోలాహలం నెలకొంది. ఉదయం మూడున్నర గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు లక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. తిరువారాధన, బాలభోగం, స్వామివారికి నిజాభిషేకం నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు తులసీ సహస్రనామార్చనలు, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చనలు చేపట్టారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దివ్య మనోహరంగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన, స్వామివారికి, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన, వెండి మొక్కు జోడు సేవలను అర్చకులు వైభవంగా నిర్వహించారు.
క్యూ కాంప్లెక్స్ చెంత కొలువైన క్షేత్ర పాలక ఆంజనేయ స్వామికి నిర్వహించిన పూజల్లో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. స్వయంభువులకు నిజాభిషేకం మొదలుకుని తుల సీ అర్చన వరకు నిత్య పూజలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. కొండకింద దీక్షాపరుల మండపంలో సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో భక్తులు పెద్ద పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. పాతగుట్టలో స్వామివారి నిత్యారాధనలు వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటంకంగా కొనసాగాయి. శ్రీవారి ఖజానాకు రూ. 46,26,300 ఆదాయం వచ్చినట్లు ఆలయాధికారులు తెలిపారు.
స్వామివారిని దర్శించుకున్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్
స్వామివారిని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. శనివారం ఉదయం కొండకు చేరుకున్న ఆయన మొదటగా స్వయంభూ పంచనారసింహుడి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చక బృందం ఆయనకు ఆలయ సంప్రదాయరీతిలో స్వాగతం పలికారు. దర్శనానంతరం అద్దాల మండపం వద్ద వారికి అర్చకులు వేదాశీర్వచనం ఇవ్వగా, ఆలయ ఈఓ ఎన్.గీత స్వామి ప్రసాదం అందించారు.