యాదాద్రి భువనగిరి, జూన్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): దేశంలోనే అద్భుత వ్యవసాయ రాష్ట్రంగా తెలంగాణ రూపాంతరం చెందాలని సీఎం కేసీఆర్ సంకల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గతేడాది వానకాలం నుంచి నియంత్రిత పద్ధతుల్లో పంటలు సాగు చేయాలని పిలుపునిచ్చారు. అదే సందర్భంలో రైతులకు మరింత చేదోడు వాదోడుగా ఉండాలన్న ఉద్దేశంతో సంక్షోభ పరిస్థితుల్లోనూ రైతులకు పెట్టుబడి సాయాన్ని అందిస్తూ వస్తున్నారు. పార్ట్”బీ’ నుంచి పార్ట్”ఏ’లోకి మారిన పాసు పుస్తకాలకు సైతం జూన్ 10వ తేదీని కటాఫ్గా పెట్టుకుని రైతుబంధు పథకాన్ని వర్తింపజేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో వారు సై తం వానకాలం సాగుకు పెట్టుబడి సాయానికి దరఖాస్తు చేసుకున్నారు. అలాగే పోడు భూ ములను సాగు చేసుకుంటున్న 168 గిరిజన రైతులకు కూడా ఈసారి సాయం అందునుంది. మొత్తంగా జిల్లాలో ఈ వానకాలం సాగుకు సంబంధించి 2,31,520 మంది రైతులకు రూ. 299.499కోట్ల పెట్టుబడి సా యంగా అందిస్తున్నారు. విడుతల వారీగా రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులను జమ చేయడం జరుగుతుందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ పెట్టుబడి సాయం అందుతుందని, రైతులు ఆందోళన చెందొద్దని వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
2018 నుంచి అందిస్తున్న సాయం ఇలా..
జిల్లాలోని రైతాంగానికి ప్రభుత్వం ఇప్ప టివరకు నాలుగు విడుతల్లో పెట్టుబడి సా యాన్ని అందజేసింది. 2018 వానకాలం, యాసంగి సాగుకు ఎకరాకు రూ.4వేల చొప్పు న సాయాన్ని అందించిన ప్రభుత్వం 2019 వానకాలం నుంచి పెట్టుబడి సాయాన్ని రూ. 5వేలకు పెంచింది. 2018 వానకాలం సాగుకు 1,71,882 మంది రైతులకు రూ.203.42 కోట్లను ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద అందజేసింది. 2018 యాసంగిలో 1,62, 858మంది రైతులకు రూ.198.5 కోట్లను బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. 2019 వానకాలంలో 1,72,343 మంది రైతులకు రూ.216.83 కోట్లను ప్రభుత్వం అందజేయ గా.. 2019 యాసంగిలో 1,25,205 మంది రైతులకు రూ.127.85 కోట్లను పెట్టుబడి సా యంగా అందించింది. 2020 వానకాలంలో 2,03,509 మంది రైతులకు రూ.285.44 కోట్లు, 2020-21 యాసంగిలో 2,09,380 మంది రైతులకు రూ.28.93కోట్లను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది. తాజాగా.. వానకాలం సాగుకు 2,31,520 మంది రైతులకు రూ.299.499 కోట్లను పెట్టుబడి సాయంగా ప్రభుత్వం అందిస్తోంది.
పాత ఖాతాల్లోకే రైతుబంధు
ఈనెల 15 నుంచి 25వ తేదీ వరకు రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతుబంధు నగదును జమ చేస్తుండగా.. పాత ఖాతాల్లోకే సంబంధిత సా యం డబ్బులు జమకానున్నాయి. బ్యాంకు ఖాతాలు, ఆధార్ కార్డులు సమర్పించని రైతు ల నుంచి ఇటీవల ఏఈవోలు వివరాలు సేకరించారు. వారికి కూడా ప్రస్తుతం రైతు బంధు సాయాన్ని వర్తింపజేస్తున్నారు. అయితే ఇటీవల ఆంధ్రాబ్యాంకు, కార్పొరేషన్ బ్యాంక్, దేనా బ్యాంకు, ఓరియంటల్ బ్యాంకు, విజయాబ్యాంకు, సిండికేట్ బ్యాంకులు ఇతర బ్యాంకుల్లో విలీనమయ్యాయి. దీనివల్ల ఆయా బ్యాంకుల ఖాతాలకు సంబంధించిన ఐఎఫ్ఎస్సీ కోడ్లు మారాయి. ఆయా బ్యాంకుల్లో ఖాతాలు ఉన్న రైతులు తమకు రైతుబంధు పడుతుందో లేదోనన్న ఆందోళనలో ఉన్నారు. కానీ..బ్యాంకుల విలీనంతో సంబంధం లేకుం డా రైతుల పాత ఖాతాల్లోకే రైతుబంధు నిధులను జమ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న ది. ఈ విషయంలో రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని అధికారులు చెబుతున్నారు. ఎవరికైనా ఇబ్బంది తలెత్తితే ఏఈవోలను సంప్రదించాలని వారు సూచిస్తున్నారు.