Farmer Suicide | యాదాద్రి భువనగిరి జిల్లాలో అప్పుల బాధతో రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మకూరు(ఎం) మండలంలోని రాయిపల్లి గ్రామానికి చెందిన రైతు నాతి మల్లయ్య గౌడ్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. రాయిపల్లి గ్రామానికి చెందిన నాటి మల్లయ్య గౌడ్ తనకున్న నాలుగు ఎకరాలతో పాటు మరో రెండు ఎకరాల కౌలుకు తీసుకుని మొత్తం ఆరు ఎకరాల్లో వరి సాగు చేశాడు. అయితే పంట పెట్టుబడి కోసం దొరికిన చోటల్లా అప్పులు చేశాడు. తీరా పంట చేతికొచ్చే సమయంలో సాగునీరందక పంట పూర్తిగా ఎండిపోయింది. దీంతో మల్లయ్య తీవ్రంగా నష్టపోయాడు. పైగా కూతురు పెళ్లి కోసం తీసుకున్న అప్పులు కూడా భారమయ్యాయి. మొత్తం 20 లక్షల అప్పు ఎలా తీర్చాలా అని తీవ్ర మనోవేదనకు గురయ్యాడు.
ఈ క్రమంలోనే అప్పులు తీర్చలేక తీవ్ర నిరాశలో మల్లయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ హనుమంతు తెలిపారు.