యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహుడి బాలాలయంలో శుక్రవారం సాయంత్రం ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవ కోలా హలంగా నిర్వహించారు. పరమ పవిత్రంగా నిర్వహించే ఈ సేవలో మహిళా భక్తులు పాల్గొని తరించారు. కొలిచిన వారికి నేనున్నానంటూ అభయ హస్తమిచ్చి కాపాడే లక్ష్మీ అమ్మవారికి విశేష పుష్పాలతో ఆలంకారం జరిపారు. బాలాలయం ముఖమండపంలో శ్రీవారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు విడుతలుగా 516 రూపాయల టికెట్ తీసుకున్న భక్తులకు సువర్ణ పుష్పార్చన జరిపించారు.
బంగారు పుష్పాలతో దేవేరులకు అర్చన చేశారు. మొదటగా శ్రీమన్యుసూక్త పారాయణం జరిపారు. ముత్తైదువులు మంగళ హారతులతో అమ్మ వారిని స్తుతిస్తూ పాటలు పాడుతూ సేవ ముందు నడిచారు. తిరువీధిసేవ అనంతరం అమ్మ వారిని బాలాలయం ముఖ మంటపంలోని ఊయలతో శయనింపు చేయించారు. గంట పాటు వివిధ రకాల పాటలతో అమ్మవారిని కొనియాడుతూ లాలిపాటలు కోలాహలంగా కొనసాగింది. అష్టోత్తర పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు.