భూదాన్ పోచంపల్లి, ఫిబ్రవరి 09 : సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని ఓ వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి నాలుగు తులాల పుస్తెలతాడును అపహరించిన ఘటన భూదాన్ పోచంపల్లిలో సోమవారం జరిగింది. బాధితుల వివరాలు ప్రకారం.. పట్టణ కేంద్రంలోని గాంధీనగర్కు చెందిన వంగూరి ప్రణీత, రాజు దంపతులు. బైక్ పై వచ్చిన ఓ వ్యక్తి డాక్టర్ అని చెప్పి 40 రోజులు మందు వాడితే సంతాన కలుగుతుందని నమ్మబలికాడు. ఇందుకు గాను రూ.12 వేలు ఖర్చు అవుతుందని తెలిపాడు. మందు చేయాలంటే కొన్ని వస్తువులు అవసరమని చిట్టి వ్రాసి ఇచ్చి బాదంతో పాటు వస్తువులు తీసుకురమ్మని రాజును పంపించాడు.
మందు పని చేయాలంటే మెడలో బంగారు వస్తువులు ఉండకూడదని చెప్పడంతో నమ్మి పుస్తెలతాడును బెడ్ పైన ఉంచారు. బెడ్ రూమ్ లోకి తీసుకెళ్లి శరీరంపై లిక్విడ్ రాయడం అనంతరం బాధితురాలని స్నానం చేయడానికి పంపించి బంగారంతో పరారయ్యాడు. స్నానం చేసి వచ్చిన తర్వాత నగలు కనిపించకపోవడంతో బాధితురాలు లబోదిబోమంటూ విలిపించసాగింది. బాధితురాలు వెంటనే డయల్ 100 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయగా స్థానిక పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.