అమ్స్టెల్వీన్ (నెదర్లాండ్స్): వరుసగా రెండు ఒలింపిక్ పతకాలు అందుకొని పూర్వవైభవం దిశగా ముందుకెళ్తున్న భారత హాకీ జట్టు అత్యంత ప్రతిష్టాత్మక ప్రపంచ కప్లోనూ మళ్లీ తన మార్కు చూపెట్టేందుకు సిద్ధమైంది. మెగా టోర్నీలో అర్ధ శతాబ్దానికి పైగా అందని ద్రాక్షగా ఉన్న కప్పు కరువుకు తెరదించడమే లక్ష్యంగా భారత పురుషుల హాకీ జట్టు తాజా ఎడిషన్ ఎఫ్ఐహెచ్ వరల్డ్ కప్ వేటను ప్రారంభించనుంది. తొలిసారి క్వార్టర్ ఫైనల్ దశ లేకుండా సరికొత్త ఫార్మాట్లో జరుగుతున్న ఈ టోర్నీలో పూల్-డిలో బరిలో నిలిచిన 8వ ర్యాంకర్ భారత్ శనివారం జరిగే తమ తొలి పోరులో 15వ ర్యాంకర్ వేల్స్తో 8వ ర్యాంకర్ తలపడనుంది. ఒలింపిక్స్లో వరుసగా ఎనిమిది స్వర్ణాలు నెగ్గిన ఘన చరిత్ర ఉన్న భారత్.. ప్రపంచకప్లో మాత్రం ఆ స్థాయిలో రాణించలేకపోయింది.
1971లో మొదలైన ఈ టోర్నీ తొలి రెండు ఎడిషన్లలో వరుసగా కాంస్యం, రజతం నెగ్గి.. 1975లో అజిత్పాల్ సింగ్ సారథ్యంలో స్వర్ణ చరిత్ర సృష్టించిన తర్వాత మరో కప్పు కాదు కదా కనీసం పతకం దరిదాపుల్లోకి కూడా రాలేదు. అయితే, ఈసారి హర్మన్ప్రీత్ సింగ్ నాయకత్వంలో పక్కా ప్రణాళికతో బరిలోకి దిగుతోంది. స్వాతంత్య్ర దినోత్సవ వేళ వేల్స్ను ఓడించి శుభారంభం చేయడం ద్వారా 51 ఏండ్ల కప్పు కలను నిజం చేసేందుకు తొలి అడుగు బలంగా వేయాలని పట్టుదలతో ఉంది. టోక్యో, పారిస్ ఒలింపిక్స్లో కాంస్య పతకాలు సాధించిన భారత్ అదే నిలకడను ప్రపంచకప్లో పునరావృతం చేయాలని భావిస్తోంది. హాకీ ప్రో లీగ్ యూరోపియన్ లెగ్లో ప్రపంచ చాంపియన్ జర్మనీ, ఒలింపిక్ విజేత నెదర్లాండ్స్ను ఓడించడంతో పాటు స్వదేశంలో ఆసియా కప్ నెగ్గడం జట్టు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. పూల్-డీలో తదుపరి ఇంగ్లండ్ (3వ ర్యాంక్), పాకిస్థాన్ (12వ ర్యాంక్) వంటి కఠిన జట్లతో తలపడాల్సిన నేపథ్యంలో వేల్స్పై గెలిచి పూర్తి పాయింట్లు సాధించడం భారత్కు అత్యంత కీలకం కానుంది.
పురుషుల టోర్నీతో సమాంతరంగా జరిగే అమ్మాయిల వరల్డ్కప్లో సలీమా టెటె కెప్టెన్సీలో భారత్ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. అమ్మాయిల విభాగంలో 1974 ఎడిషన్లో నాలుగో స్థానంలో నిలవడమే మన జట్టుకు అత్యుత్తమ ప్రదర్శన. ఈసారి ఎలాగైనా పతకం నెగ్గాలని ఆశిస్తున్న టెటె సేన పూల్-డీలో భాగంగా ఆదివారం చైనాతో టైటిల్ వేటను ఆరంభించనుంది. 18న సౌతాఫ్రికా, 20న ఇంగ్లండ్ తో పోటీ పడనుంది.
పురుషులతో పాటు మహిళల విభాగంలో ఈ ప్రపంచకప్లో తలపడుతున్న 16 జట్లను నాలుగు పూల్స్గా విడదీశారు. ఒక్కో పూల్లో నాలుగు జట్లు మిగతా మూడు ప్రత్యర్థులతో ఒక్కో మ్యాచ్ ఆడతాయి. ప్రతీ పూల్లో టాప్-2లో నిలిచిన టీమ్స్.. తదుపరి రౌండ్కు అర్హత సాధిస్తాయి. ఈ దశలోనూ అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు సెమీస్కు (ఈసారి టోర్నీలో క్వార్టర్స్ దశను తొలగించారు) క్వాలిఫై అవుతాయి. మహిళల ఫైనల్ ఈనెల 29న, అబ్బాయిల తుదిపోరు 30న జరుగుతుంది.
