యాదాద్రి, ఏప్రిల్12 : యాదాద్రి ఆలయం అత్యద్భుతంగా ఉందని, ఇంత మంచి రాతి నిర్మాణం మునుపెన్నడూ జరుగలేదని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. మంగళవారం ఏకాదశి పురస్కరించుకుని ఆయన విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతితో కలిసి స్వయంభూ లక్ష్మీనరసింహుడిని దర్శించుకున్నారు. మొదటగా ప్రధానాలయ తూర్పు ప్రవేశ రాజగోపురం నుంచి ఆలయంలోకి ప్రవేశించారు. త్రితల రాజగోపురం వద్ద వారికి ఆలయ ప్రధానార్చకులు, వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ముఖ మండపంలోకి ప్రవేశించిన పీఠాధిపతులు గర్భాలయంలో స్వయంభువును దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు.
స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ముఖ మండపంలో స్వర్ణతాపడ ధ్వజస్తంభానికి నమస్కరించుకున్నారు. ఆలయ ముఖ మండపంలో పీఠాధిపతి ఆశీనులు కాగా, ఆలయ ఈఓ ఎన్. గీత, ప్రధానార్చకుడు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ ఎన్. గీత వారికి ప్రత్యేక వస్ర్తాలను అందించారు. ఆ తర్వాత పీఠాధిపతి ముఖ మండపంలోని ఆళ్వారు విగ్రహాలు, నూతనాలయాన్ని పరిశీలించారు. అనంతరం యాదాద్రి కొండకింద తులసీ కాటేజీ వద్ద మీడియాతో మాట్లాడారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవాలని పదిరోజుల క్రితం ఆకాంక్షించామని, ఏకాదశి రోజున స్వామివారి దర్శనం కలుగడం ఆనందంగా ఉందని చెప్పారు. భక్తులు గొప్పగా పొగుడుతుండడంతో ఆలయాన్ని చూడడానికి వచ్చామని తెలిపారు.