ఖైరతాబాద్, ఆగస్టు 5 : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైందని ప్రభుత్వ పెన్షన్దారుల జేఏసీ విమర్శించింది. బుధవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో జేఏసీ చైర్మన్ కే లక్ష్మయ్య మాట్లాడుతూ.. ఎన్నికల మ్యానిఫెస్టోలో హెల్త్ కార్డుల ద్వారా నగదురహిత వైద్య సేవలు అందిస్తామని హామీ ఇచ్చారని, పీఆర్సీ అమలు, కరువుభత్యం, బకాయిల విడుదల, పెన్షనరీ బకాయిల చెల్లింపు వంటి హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని విమర్శించారు.
2024 ఏప్రిల్ నుంచి ఉద్యోగ విరమణ చేసిన వారిలో వంద మందికిపైగా అనారోగ్యంతో తీవ్ర ఇబ్బందులు ఎదురొన్నారని, పెన్షనరీ ప్రయోజనాలు అందకపోవడం, వైద్య ఖర్చులు భరించలేకపోవడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తంచేశారు. ఉద్యమాలు, కోర్టు ఉత్తర్వుల ద్వారా కొంతమందికి మాత్రమే పెన్షనరీ బెనిఫిట్స్ అందాయని, ఇంకా వేలాదిమందికి ఇవ్వాల్సి ఉన్నదని తెలిపారు. ప్రభుత్వం రూ.6వేల కోట్లను విడుదల చేసినట్టు ప్రకటించినప్పటికీ, సగం మందికి కూడా బకాయిలు అందలేదని ఆరోపించారు. పెన్షనర్ల అనుమతి లేకుండానే వారి పెన్షన్ నుంచి 1.5 శాతం చొప్పున ప్రభుత్వం కోత విధించడం అన్యాయమని మండిపడ్డారు.
ఆ మొత్తాన్ని వసూలు చేస్తున్నప్పటికీ కొత్త ఆరోగ్య కార్డులు ఇవ్వడం లేదని, పాత ఆరోగ్య కార్డులు పనిచేయడం లేదని పేర్కొన్నారు. దీంతో పెన్షనర్లు అత్యవసర వైద్య సేవలకు నోచుకోలేని పరిస్థితి నెలకొన్నదని వాపోయారు. మూడేండ్ల క్రితమే పీఆర్సీ కమిషన్ను నియమించిన ప్రభుత్వం, ఇప్పటివరకూ ఆ కమిషన్ నివేదికను స్వీకరించి ప్రకటించలేదని విమర్శించారు. తమ సమస్యలపై సీఎం, డిప్యూటీ సీఎం, ఉన్నతాధికారులకు పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినా స్పందన లేదని, దీంతో ఈ నెల 7న ఇందిపార్క్ వద్ద మహాధర్నాకు పిలుపునిచ్చినట్టు తెలిపారు. సమావేశంలో జేఏసీ సెక్రటరీ జనరల్ తులసి సత్యనారాయణ, ఫైనాన్స్ సెక్రటరీ బీఎన్వీవీ కృష్ణప్రసాద్, కో చైర్మన్, సహాధ్యక్షులు పుల్లయ్య, భరత్రెడ్డి, రాజేంద్రబాబు, డిప్యూటీ సెక్రటరీ జనరల్ జనార్దన్భట్, సలహాదారు టీ శుభాకర్రావు తదితరులు పాల్గొన్నారు.