హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): హైడ్రా కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ ఫైర్ ఎన్వోసీలను ఇంటర్బోర్డుకు సమర్పించిన ప్రైవేట్, కార్పొరేట్ జూనియర్ కళాశాలల వ్యవహారం బరితెగింపునకు నిదర్శనమని ఏఐవైఎఫ్ పేర్కొన్నది. ఈ మేరకు ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, వలిఉల్లా ఖాద్రీ, ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసే స్థాయికి విద్యా మాఫియా దిగజారిదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతుందని తెలిపారు. వేలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న పలు ప్రైవేట్ కళాశాలలది క్షమించరాని నేరమని అభిప్రాయపడ్డారు. ఇలాంటి సంస్థలపై కేవలం కేసులు నమోదు చేయడం సరిపోదని, వెంటనే గుర్తింపును రద్దు చేసి, యాజమాన్యాలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు.